
కాలువలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
మునగాల, మిర్యాలగూడ టౌన్: సాగర్ ఎడమ కాలువలో ఈతకు వెళ్లి గల్లంతైన వ్యక్తి మృతదేహం శుక్రవారం మునగాల మండల కేంద్రం శివారులో లభ్యమైంది. మునగాల ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తక్కెళ్లపహాడ్ గ్రామానికి చెందిన చౌగాని శంకర్(38) తన స్నేహితులతో కలిసి బుధవారం గ్రామ శివారులోని సాగర్ ఎడమ కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి నీటి ప్రవాహానికి గల్లంతయ్యాడు. శంకర్ మృతదేహం శుక్రవారం మునగాల మండల కేంద్రం శివారులో సాగర్ ఎడమ కాలువలో గుర్తుతెలియని మృతదేహం కొట్టుకొని వెళ్తుండగా స్థానికులు గమనించి మునగాల పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే మునగాల ఎస్ఐ ప్రవీణ్కుమార్ తన సిబ్బందితో ఎడమ కాలువ వద్దకు చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పలు పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. మిర్యాలగూడ రూరల్ పోలీసులు స్పందించి శంకర్ కుటుంబ సభ్యులను అక్కడికి తీసుకెళ్లగా మృతదేహం శంకర్దేనని గుర్తించారు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ లక్ష్మయ్య తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి.. భార్యకు గాయాలు
మునగాల: విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారిపై మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త మృతిచెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ బి. ప్రవీణ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం రామాపురం గ్రామానికి చెందిన పాలమాకుల సోమయ్య(45), ధనలక్ష్మి దంపతులు కోడిగుడ్ల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం మునగాల మండలం ఆకుపాములలో కోడిగుడ్లు కొనుగోలు చేసి తమ సొంత ఆటోలో స్వగ్రామానికి వెళ్తుండగా.. ఆకుపాముల గ్రామ శివారులోని జియో పెట్రోల్ బంబక్ వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టాటా ఏస్ వాహనం వెనుక నుంచి అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సోమయ్య, ధనలక్ష్మి దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని 108 వాహంనంలో కోదాడలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ సోమయ్య మృతిచెందాడు. సోమయ్య భార్య ధనలక్ష్మి ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. మృతుడి కుమారుడు కార్తీక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.