
ప్రైవేట్కు దీటుగా బోధన
సూర్యాపేటటౌన్ : ‘ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నాం.. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం విద్యార్థులకు సకాలంలో ఉచితంగా అందిస్తున్నాం.. ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన చేయడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాం.. కార్పొరేట్ మోజులో పడకుండా తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలి.. విద్యార్థుల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తున్నాం’ అని డీఈఓ కె. అశోక్ తెలిపారు. గురువారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి సాక్షితో పలు విషయాలు వెల్లడించారు.
ఉపాధ్యాయులు ప్రచారం చేస్తున్నారు
జిల్లాలో 690 ప్రాథమిక పాఠశాలలు, 78 ప్రాథమికోన్నత, 182 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటితో పాటు 19కేజీబీవీలు, తొమ్మిది మోడల్ స్కూల్స్, నాలుగు మినీ గురుకులాలు, ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రస్తుతం బడిబాట కార్యక్రమం జిల్లాలో కొనసాగుతోంది. ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వివరిస్తున్నారు. ఈ ఏడాది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ సంఖ్యలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది.
బోధనకు ఇబ్బందులు కలగకుండా..
విద్యార్థుల బోధనకు ఇబ్బంది కలుగకుండా సరిపడా ఉపాధ్యాయులు ఉన్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన వారు, అలాగే ప్రమోషన్స్ రావడంతో సబ్జెక్టు టీచర్ల కొరత లేదు. ఇంకా ఎక్కడైనా విద్యార్థులు ఎక్కువ ఉండి ఉపాధ్యాయులు తక్కువగా ఉంటే సర్దుబాటు చేస్తాం. కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నాణ్యమైన బోధనే లక్ష్యంగా పని చేస్తున్నాం. జిల్లాలో 3,790 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వేసవిలో వీరికి క్వాలిటీ విద్యపై వృత్యంతర శిక్షణ ఇచ్చాం. విద్యార్థులకు బోధనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ఉంది. జిల్లాలోని 18 పాఠశాలల్లో ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) బోధన అందిస్తున్నాం. ఏఐ బోధన ద్వారా 20శాతం మంది విద్యార్థుల్లో 20 రోజుల్లో చదువులో మార్పు కనిపించింది. ఏఐ బోధనలో రాష్ట్రంలోనే మనం 6వ స్థానంలో ఉన్నాం. ఈ విద్యాసంవత్సరం మరిన్ని పాఠశాలల్లో ఏఐ బోధన కొనసాగిస్తాం. గత విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో 40 మంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. వారికి సన్మానం కూడా చేశాం.
విద్యార్థులకు స్వాగతం పలికేందుకు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పూర్తి చేశాం. టాయిలెట్స్, పాఠశాలల ఆవరణలు, బాత్రూంలు, తరగతి గదుల్లో పరిశుభ్రతతో రెడీగా ఉంచాం. పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధం చేశాం. విద్యార్థులకు స్వాగతం పలుకుతూ మొదటి రోజే వారికి యూనిఫాం, పుస్తకాలు అందజేస్తాం. మొదటి రోజు నుంచి మధ్యాహ్న భోజనం, రాగి జావ అందించనున్నాం. పాఠశాలల్లో ఇంకా ఏమైనా పెండింగ్ పనులు ఉంటే వాటిని కూడా త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.
ఫ ప్రభుత్వ పాఠశాలల్లో
సౌకర్యాలు మెరుగుపర్చాం
ఫ ఏఐ బోధనలో రాష్ట్రంలో ఆరో స్థానం
ఫ విద్యార్థుల సంఖ్యను పెంచడమే
లక్ష్యంగా బడిబాట
ఫ సర్కారు స్కూళ్లలోనే పిల్లలను
చేర్పించాలి
ఫ డీఈఓ అశోక్

ప్రైవేట్కు దీటుగా బోధన