
రెవెన్యూ సదస్సులను వినియోగించుకోవాలి
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. బుధవారం తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై తగిన ఆధారాలతో ప్రభుత్వం నిర్దేశించిన నమూనాలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. రైతులు సమర్పించిన దరఖాస్తులను పూర్తి స్థాయి విచారణ చేసిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణాలతో పాటు అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ నెల 30వ తేదీ వరకు రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం లబ్ధిదారులెవరైనా అమ్ముకున్నట్లు తెలిస్తే వారి రేషన్ కార్డులు రద్దవుతాయని ఆయన హెచ్చరించారు. సన్నబియ్యం పథకాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హరిప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ జాన్మహ్మద్, ఆర్ఐలు జార్జిరెడ్డి, సుజిత్రెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.