
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి : ఎస్పీ
సూర్యాపేటటౌన్ : విద్యార్థులు బాగా చదివి ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని జిల్లా ఎస్పీ కె.నరసింహ సూచించారు. పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నంబర్ 2 ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారితో మాట్లాడారు. సమాజాన్ని మంచి మార్గంలో నడిపేది ఉపాధ్యాయ వృత్తి అని, తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అని అన్నారు. బాలలకు తరగతి గదిలోనే ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాఠశాలకు వెళ్లాలని, బాలల చదువుకు ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లలను పనిలో పెట్టుకుంటే చర్యపరమైన చర్యలు తప్పవనిహెచ్చరించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పోలీస్ టీమ్స్ పని చేస్తున్నాయని చెప్పారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదవి ఉన్నత స్థాయికి ఎదగాలన్నారు. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మాతృభూమికి మంచి పేరు తేవాలని, ప్రజలకు సేవలు అందించే విధంగా ఎదగాలన్నారు. ఈ పాఠశాలలో చదివి ఈ విద్యా సంవత్సరం 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకుని ప్రథమ స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.10,116, ద్వితీయ స్థానంలో నిలిచే విద్యార్థికి రూ.5,116 జిల్లా పోలీసు శాఖ తరఫున బహుమతిగా ఇస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ యం.ఉదయ శ్రీ, సీఐ రాజశేఖర్, ఎస్ఐలు పాల్గొన్నారు.