
నీరు సురక్షితమేనా!
సూర్యాపేట అర్బన్: ఏటా వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. అందుకు ప్రధాన కారణం కలుషిత నీరు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీటి నాణ్యతపై తప్పక దృష్టి సారించాలి. సూర్యాపేట పట్టణంలో మిషన్ భగీరథ పథకంతో పాటు శివారు ప్రాంతాలైన వార్డుల్లో స్థానిక బోర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. వర్షాలు పడుతుండడంతో అధికార యంత్రాంగం నీరు కలుషితం కాకుండా, అంటువ్యాధులు, విష జ్వరా లు ప్రబలకుండా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. ట్యాంకులు, నల్లాల వద్ద నీటి నమూనాలను సేకరించి తప్పనిసరిగా పరీక్షలు చేసి నాణ్యమైన నీటినే ప్రజలకు అందించాలి.
ప్రజా కుళాయిల దగ్గర జాగ్రత్త
సూర్యాపేట పట్టణంలోని వార్డుల్లో అనేక చోట్ల ప్రజా కుళాయిలను గాలికి వదిలేస్తున్నారు. పట్టణంలోని చాలా చోట్ల మిషన్ భగీరథ పైపులైన్లు లీకేజీకి గురై మురుగు నీటితో కలుషితమవుతున్నాయి. మున్సిపల్ ట్యాంక్లు అపరిశుభ్ర వాతావరణంలో ఉన్నాయి. నాణ్యత, పర్యవేక్షణ విషయాన్ని అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. మురికి వాడలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా ఇవి ఉన్నాయి. వీటి నుంచి సరఫరా అయ్యే నీటికి నాణ్యత పరీక్షలు చేయడం లేదు.
లీకేజీల సమస్య
మురుగు కాలువల నుంచి పైప్ లైన్లు వేసినప్పుడు, కాలువల్లో సీల్డ్ తీసినప్పుడు పైప్లైన్ దగ్గర లీకేజీలు ఏర్పడి నీరు కలుషితమవుతుంటుంది. అధిక లోతులో ఉండే డ్రెయినేజీల్లో లోపల వేసిన పైపులు లీకేజీకి గురైతే గుర్తించే అవకాశం ఉండదు. అలాంటి సందర్భాల్లో నీరు కలుషితమై రోగాలకు దారితీస్తుంది. వర్షాకాలంలో కలుషితమయ్యే నీటి వల్ల డయేరియా, టైఫాయిడ్, కామెర్లు, వాంతులు, విరేచనాలు వస్తుంటాయి.
నీటి పరీక్షలు చేస్తున్నాం
100 రోజుల ప్రణాళికలో భాగంగా నీటి పరీక్షలను ప్రత్యేకంగా చేస్తున్నాం. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. పట్టణంలోని వార్డుల్లో ట్యాంకులను ప్రతినెల 1, 11, 21 తేదీల్లో శుభ్రం చేయాలని ఆదేశించాం. నీటి నమూనాలు సేకరించి పరీక్షలు చేసే విధానంపై వార్డ్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో పట్టణ ప్రాంతాల్లోని వార్డుల్లో అంగన్వాడీ ఆయాలు, ఏఎన్ఎంలకు శిక్షణ ఇచ్చాం. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నాం.
– శ్రీనివాస్,
సూర్యాపేట మున్సిపల్ కమిషనర్

నీరు సురక్షితమేనా!