
దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మితమవుతుంది
చివ్వెంల(సూర్యాపేట) : దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మితమవుతుందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల పరిధిలోని కుడకుడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించాలని సూచించారు. పాఠశాలలో ఎక్కువ మంది విద్యార్థులు చేరేలా చూడాలన్నారు. ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి పూర్తయిన విద్యార్థులను జెడ్పీహెచ్ఎస్లో ఆరో తరగతిలో చేర్పించాలన్నారు. పాఠశాలలో 13 మంది నూతనంగా చేరినట్లు ఉపాధ్యాయులు కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఒకటవ తరగతి చదువుతున్న చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం రెండవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాం అందజేశారు. ఆయన వెంట హెచ్ఎంలు కవిత, శ్రీనివాస్, ఉపాధ్యాయులు వెంకటనర్సమ్మ, ప్రతాఫ్కుమార్, రాజు, విజయలక్ష్మీ, అనురాధ, సత్తయ్య, కోటయ్య, రవిందర్, బాలచందర్ తదితరులున్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్