ఉపాధిపై సాగు ప్రభావం | - | Sakshi
Sakshi News home page

ఉపాధిపై సాగు ప్రభావం

Jun 13 2025 7:21 AM | Updated on Jun 13 2025 7:21 AM

ఉపాధి

ఉపాధిపై సాగు ప్రభావం

నాగారం : వానాకాలం సాగు పనులు ప్రారంభం కావడం, విత్తనాలు విత్తే సమయం ఉండడం, ఉపాధి కంటే వ్యవసాయ పనులకు వెళ్తే రోజు వారి కూలి ఎక్కువ రావడం తదితర కారణాలతో జిల్లాలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు తగ్గాయి. ఒక్కొక్క కూలీకి రోజుకు రూ.400 నగదు అందుతుండటంతో సాగు పనుల వైపే రైతులు మొగ్గుచూపుతున్నారు.

గత నెలలో..

జిల్లా వ్యాప్తంగా ఉపాధి కూలీలు రోజుకు సరాసరి 60 శాతం పైనే గత నెలలో హాజరయ్యేవారు. గతనెల 10న మొత్తం 475 గ్రామాలలో ఉపాధి పనులు నిర్వహించగా సరాసరి 80.50శాతంతో 38,240 మంది కూలీలు పాల్గొన్నారు. అదే నెల 20న సరాసరి 92.31 శాతంతో 43,848 మంది కూలీలు, ఈనెలలో 10వ తేదీన 475 గ్రామాలలో ఉపాధి హామీ పనులు నిర్వహించగా సరాసరి 57.0శాతంతో 26,868 మంది కూలీలే పనులు చేయడం విశేషం. అత్యధికంగా నడిగూడెం మండలంలో సరాసరి 134 శాతంతో 2012 మంది కూలీలు పాల్గొంటే.. అత్యల్పంగా చిలుకూరు మండలంలో సరాసరి 24శాతంతో 413 కూలీలు పనులు చేశారు. ప్రస్తుతం ప్రతి గ్రామంలో కనీసం 100 మంది కూలీలు వచ్చేలా చూడాలని జిల్లా అధికారులు ఆదేశిస్తున్నారు. ఆ లెక్కన పనులు జరుగుతున్న 475 గ్రామాలలో 47,500 మంది కూలీలు పాల్గొనాల్సి ఉంది. కానీ కేవలం 26,868 మంది కూలీలే పనులు చేస్తుండటం గమనార్హం.

ఏం చేయాలి..?

ఉపాధి పనులను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే సాగు కాలంలోనూ కూలీల రాక మరింత పెరగనుంది. రైతులకు ఆర్థికంగా ఉపయోగకరంగా మారనుంది. ఈ విషయంలో చర్చలు మినహా నిర్ణయాలు లేకపోవడం విశేషం.

2.62లక్షల జాబ్‌కార్డులు

జిల్లాలో 23 మండలాల పరిధిలో 475 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2.62లక్షల జాబ్‌కార్డులు ఉండగా, వీటి పరిధిలో 5.70 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. కాగా వీరిలో ప్రస్తుతం పనులకు వెళుతున్న కూలీలు 26,868 మంది ఉన్నారు. జిల్లాలో వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత మళ్లీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఉపాధి హామీ పథకంలో భాగంగా ప్రస్తుతం ఇంకుడు గుంతలు, పశువుల షెడ్ల నిర్మాణం, కోళ్ల షెడ్లు, నీటి తొట్లు, నీటి నిల్వ వసతులు, నర్సరీల ఏర్పాటు, చెక్‌ డ్యామ్‌లు, మరుగుదొడ్ల నిర్మాణం, పంట పొలాలకు రోడ్ల అనుసంధానం, నీటి కుంటల నిర్మాణం, వనమహోత్సవంలో పండ్ల తోటల పెంపకం, మొక్కల సంరక్షణ పనులను చేపడుతున్నారు.

కూలీల సంఖ్య పెరిగే అవకాశం ఉంది

లక్ష్యానికి అనుగుణంగా కూలీలకు పనులు కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. వ్యవసాయ పనులు మొదలైన నేపథ్యంలో ఆశించిన స్థాయిలో కూలీలు రాలేకపోతున్నారు. విత్తనాలు వేసే పనులు ముగిసిన తర్వాత మళ్లీ సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

– వి.వి అప్పారావు, డీఆర్డీఓ

ఫ ఉపాధి హామీ పనులకు

వెళ్లడానికి ఆసక్తి చూపని కూలీలు

ఫ గత నెలతో పోల్చితే తగ్గిన కూలీల హాజరు

ఫ వ్యవసాయ పనులకు వెళ్లేందుకు మొగ్గు

ఉపాధిపై సాగు ప్రభావం1
1/1

ఉపాధిపై సాగు ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement