
భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు
చివ్వెంల(సూర్యాపేట) : రైతుల భూ సమస్యల పరిష్కారానికే ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు తెలిపారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చివ్వెంల, బీబీగూడెం గ్రామాల్లో రైతుల వద్ద నుంచి 441 దరఖాస్తుల వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాశ్రావు, ఆర్ఐలు శ్రీనివాస్, శ్రావణి పాల్గొన్నారు.
సాగర్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయం రేడియల్ క్రస్ట్గేట్ల డ్రై ట్రయల్ రన్ పనులు ముమ్మరం చేశారు. జలాశయం గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00అడుగులు కాగా 312.0450 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. అంతకు మించి వచ్చే వరదనీటి ప్రవాహాన్ని సమర్థంగా దిగువకు విడుదల చేయాలంటే క్రస్ట్గేట్ల పనితీరు అత్యంతకీలకం. గత నెలలోనే ఈ గేట్లకు సీల్స్ వేయడంతోపాటు బోల్ట్నట్స్ బిగింపు, వెల్డింగ్ పనులు పూర్తి చేశారు. రెండు రోజులుగా గేట్లకు సంబంధించి డ్రై ట్రయల్ రన్ పనులు కొనసాగుతున్నాయి. భద్రత పరంగా వర్షాకాలానికి ముందే అన్ని గేట్ల పనితీరును పూర్తిగా పరిశీలించేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. గేట్లను ఎత్తి, దింపేందుకు వినియోగించే ఇనుపతాళ్లకు కార్డియమ్ కంపౌండ్ చేయడంతో పాటు గ్రీసింగ్, బేరింగ్ల చెకింగ్, లింక్ సిస్టం ఫంక్షనింగ్ తదితర పనులు చేస్తున్నారు. ఒక్కోగేటును మ్యానువల్గా లేపి ట్రయల్ రన్ ద్వారా పనితీరును పరీక్షిస్తున్నారు. ప్రస్తుతం 1, 2 గేట్ల పనులు పూర్తి చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. ఈ మాసాంతం లోపే 26 రేడియల్ క్రస్ట్ గేట్లన్నింటిని ట్రయల్ రన్ చేసేందుకు పనులు ముమ్మరం చేసినట్లు చెప్పారు.
సీపీఐ జిల్లా కార్యదర్శిగా బెజవాడ వెంకటేశ్వర్లు
సూర్యాపేట : సీపీఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా బెజవాడ వెంకటేశ్వర్లు మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల జిల్లాకేంద్రంలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తూ ప్రజలసమస్యలు పరిష్కారానికి కృషిచేస్తానన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి పాటుపడతానన్నారు. తన ఎన్నికకు సహకరించిన జిల్లా కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, రాష్ట్ర నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
న్యాయవాద శిక్షణకు
దరఖాస్తుల ఆహ్వానం
భానుపురి (సూర్యాపేట) : 2025–26 విద్యా సంవత్సరంలో న్యాయవాద వృత్తిలో మూడేళ్ల శిక్షణకు ఎస్సీ కులానికి చెందిన న్యాయవాద పట్టభద్రుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి దయానందరాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయశాస్త్ర డిగ్రీ ఉత్తీర్ణులై, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2లక్షలకు మించని అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. శిక్షణ కాలంలో నెలకు రూ.3వేల స్టైఫండ్, పుస్తకాల కొనుగోలుకు రూ.50వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. వచ్చే నెల 17వరకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు

భూ సమస్యల పరిష్కారానికే సదస్సులు