ఉపాధ్యాయుల సర్దుబాటు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల సర్దుబాటు

Jun 11 2025 7:44 AM | Updated on Jun 11 2025 7:44 AM

ఉపాధ్యాయుల సర్దుబాటు

ఉపాధ్యాయుల సర్దుబాటు

సూర్యాపేటటౌన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను తీర్చేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలని నిర్ణయించింది. జూలై 15వ తేదీ వరకు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సమీప బడుల నుంచి సర్దుబాటు చేయనున్నారు. ఈనెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో ఒక్కో పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? ఉపాధ్యాయుల సంఖ్య ఎంత తదితర వివరాలను ఎంఈఓల ద్వారా సేకరిస్తున్నారు.

జిల్లాలో 950 పాఠశాలలు..

3790 మంది ఉపాధ్యాయులు..

జిల్లాలో మొత్తం ప్రభుత్వ పాఠశాలలు 950 ఉన్నాయి. వీటిలో 182 జెడ్పీఉన్నత, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 690 ప్రాథమిక, 78 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 70వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరికి 3,790 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు.

వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ

ప్రతి పాఠశాలలో సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయుల కొరత ఉండకుండా చూడాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలను గుర్తిస్తున్నారు. జిల్లాలోని 23 మండలాల పరిధిలోని ఎంఈఓల ద్వారా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు సేకరిస్తున్నారు. ఈ వివరాలు సేకరణ పూర్తి కాగానే సర్దుబాటు చేయనున్నారు.

విద్యార్థుల చేరికల తర్వాత చేస్తే..

పాఠశాలలు పునఃప్రారంభంనాటికి సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేయాలని తొలుత విద్యాశాఖ భావించింది. అయితే ఈనెల 6 నుంచి బడిబాట నిర్వహిస్తున్నందున స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యపెరుగుతుందని అందువల్ల పాఠశాలలు పునఃప్రారంభం కాగానే టీచర్లను సర్దుబాటు చేస్తే ప్రయోజనం ఉండదని ఉపాధ్యాయ సంఘాలు ఈ ప్రక్రియను వ్యతిరేకించాయి. దీంతో సర్దుబాటు ప్రక్రియను పూర్తి చేసే గడువును జూలై 15వరకు పెంచుతూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఎక్కువ మంది విద్యార్థులు ఉండి తక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలకు తక్కువ మంది విద్యార్థులు ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్ల నుంచి బదిలీ చేయనున్నారు. గతంలో మండల స్థాయిలో సర్దుబాటు చేసినా ఉపాధ్యాయులు వెళ్లకపోవడంతో సమస్యలు ఏర్పడ్డాయి. ఈసారి కలెక్టర్‌ నుంచి ఉత్తర్వులిప్పించాలని నిర్ణయించారు. విద్యార్థుల చేరికల తర్వాత సర్దుబాటు చేస్తే బాగుంటుందని టీచర్లు అంటున్నారు.

ఫ విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా బదిలీలు

ఫ జూలై 15లోపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం

ఫ వివరాలు సేకరిస్తున్న జిల్లా విద్యాశాఖ

ఫ జిల్లాలో 3,790 మంది ఉపాధ్యాయులు

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా

ఉండాల్సిన టీచర్లు

విద్యార్థుల సంఖ్య టీచర్లు

1నుంచి 10 ఒకరు

11 నుంచి 60 ఇద్దరు

61 నుంచి 90 నలుగురు

91 నుంచి 120 ఐదుగురు

121 నుంచి 150 ఐదుగురు

151 నుంచి 200 ఆరుగురు

ప్రస్తుతం ఉన్న

ఉపాధ్యాయుల సంఖ్య ఇలా..

ఎస్‌టీజీలు 1,693

స్కూల్‌ అసిస్టెంట్‌లు 1,787

జీహెచ్‌ఎంలు 160

ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు 150

నిబంధనల ప్రకారం సర్దుబాటు చేస్తాం

ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తాం. బడి బాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా పని చేస్తున్నాం. సర్దుబాటు ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం వివరాలు సేకరిస్తున్నాం. పాఠశాలలు పునఃప్రారంభం కాగానే సర్దుబాటు చేస్తాం. విద్యార్థులకు నాణ్యమైన, ఉత్తమ బోధన అందించేందుకు కృషి చేస్తాం. –అశోక్‌, డీఈఓ

కొన్ని పాఠశాలల్లో ఇలా..

తుంగతుర్తి జెడ్పీహెచ్‌ఎస్‌లో 11 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.

మునగాల మండలం నారాయణగూడెం జెడ్పీహెచ్‌ఎస్‌లో 16 మంది విద్యార్థులకు గాను ఎనిమిది మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు.

హుజూర్‌నగర్‌ మండలం అమరవరం ఎంపీపీఎస్‌లో 114 మంది విద్యార్థులు ఉండగా నలుగురు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నారు.

చిలుకూరు మండలం జేరిపోతులగూడెం ఎంపీపీఎస్‌లో 101 మంది విద్యార్థులు ఉండగా కేవలం ముగ్గురు ఉపాధ్యాయులే ఇక్కడ పని చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement