ఆకాశమే హద్దుగా విద్యార్థులు ప్రయత్నించాలి | - | Sakshi
Sakshi News home page

ఆకాశమే హద్దుగా విద్యార్థులు ప్రయత్నించాలి

Jun 12 2025 7:29 AM | Updated on Jun 12 2025 7:29 AM

ఆకాశమ

ఆకాశమే హద్దుగా విద్యార్థులు ప్రయత్నించాలి

భానుపురి (సూర్యాపేట) : ఆకాశమే హద్దుగా విద్యార్థులు అవకాశాల కోసం ప్రయత్నించాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. బుధవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో బడిబాట కార్యక్రమం పై కలెక్టర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. 10వ తరగతిలో అత్యంత ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 10వ తరగతి ఫలితాలు మొదటి అడుగుగా భావించి విద్యార్థులు కష్టపడి చదవాలన్నారు. పిల్లలు దేశ భవిష్యత్తు అని, సమాజం వారి మీద ఆధారపడి ఉందన్నారు. ‘నేటి మీ ఆలోచనలే రేపటి మాటలుగా, పనులుగా, అలవాట్లుగా, గమ్యస్థానాలుగా మారి మీ జీవితాలను ఉన్న స్థాయికి చేరుకునేలా చేస్తాయి.. కాబట్టి మంచి గా ఆలోచనలు చేయాలి’ అని సూచించారు. విద్యార్థులు సమాజంలో మంచి దారిలో వెళ్లేందుకు ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో, రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఉన్నత పదవుల్లో, వ్యాపారాల్లో, ప్రభుత్వ ఉద్యోగాలలో ఉండాలని దానికి ఏ సహాయం కావాలన్నా తన వంతు సహకారం అందిస్తానని కలెక్టర్‌ తెలిపారు. జిల్లాలో బడి బయట ఒక్క విద్యార్థి కూడా లేకుండా అందరూ చదువుకోవాలన్నదే సంకల్పం అని తెలిపారు. జిల్లాలో బడిబాట కార్యక్రమాన్ని ఏప్రిల్‌ నెలలో ఉపాధ్యాయులు మొదలుపెట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయటంలో ఎంతో కృషి చేశారని అన్నారు.

పండుగ వాతావరణంలో ప్రారంభించాలి

పాఠశాలలను పండుగ వాతావరణంలో పునఃప్రారంభించాలని, గ్రామంలోని పెద్దలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యుల చేతులమీదుగా విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫాం ఇప్పించాలని సూచించారు. జిల్లాలో మంచి ప్రతిభ చూపిన మూడు జిల్లా, మండల పరిషత్‌ ఉన్నత పాఠశాలలకు నగదు పురస్కారాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం పదో తరగతిలో ప్రతిభ చూపించిన విద్యార్థులకు నవత పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ పి. రాంబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్‌, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్‌ రెడ్డి, సంక్షేమ అధికారి నర్సింహారావు, కోఆర్డినేటర్లు జనార్దన్‌, శ్రవణ్‌ కుమార్‌, రాంబాబు, డీసీఓలు, ఆర్‌ సీఓ లు, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెడ్‌ మాస్టర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని అమలు చేయాలి

భానుపురి (సూర్యాపేట) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ సూచించారు. బుధవారం సూర్యాపేట జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కె. శంకర్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పథకాన్ని సత్వర అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని మఠంపల్లి, పాలకవీడు, చింతలపాలెం మండలాల్లో అటవీ భూములు పొందిన గిరిజన రైతులు ఉన్నారని, సోలార్‌ విద్యుత్‌ పై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అటవీశాఖ అధికారి సతీష్‌ కుమార్‌, భూ గర్భజలశాఖ అధికారి బాలునాయక్‌, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా హార్టికల్చర్‌ – సెరీకల్చర్‌ అధికారి నాగయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్‌ రెడ్డి, మఠంపల్లి, పాలకవీడు, చింతలపాలెం ఎంపీడీఓలు పాల్గొన్నారు.

ఫ సమాజంలో విద్య ద్వారానే

శాశ్వతమైన మార్పు

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

ఆకాశమే హద్దుగా విద్యార్థులు ప్రయత్నించాలి1
1/1

ఆకాశమే హద్దుగా విద్యార్థులు ప్రయత్నించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement