
రేషన్కార్డు మాకెప్పుడు!
భానుపురి (సూర్యాపేట) : రేషన్కార్డులు లేని నిరుపేదలకు ఇబ్బందులు తప్పడంలేదు. ప్రభుత్వ పథకాలన్నింటికీ ఈ కార్డునే ప్రమాణికంగా తీసుకుంటున్నారు. దీంతో కార్డులేని వారు పథకాలకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారు. రేషన్కార్డు కోసం జిల్లా వ్యాప్తంగా కొత్తగా 1,03,798 మంది దరఖాస్తుచేసుకున్నారు. ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 2,350 మందికి మాత్రమే కార్డులు పంపిణీ చేశారు. ఈనెల 1నుంచి ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండడంతో మిగిలినవారంతా కార్డు తమకెప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
1,03,798 దరఖాస్తులు పెండింగ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో రేషన్ కార్డుల కోసం ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేదు. గత పదేళ్ల కాలంలో ప్రజలు వివిధ సందర్భాల్లో అందించిన వినతులనే పరిగణనలోకి తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో నూతన రేషన్ కార్డుల కోసం ఆన్లైన్లో 28వేల దరఖాస్తులు, మార్పులు, చేర్పుల నిమిత్తం 52వేల దరఖాస్తులు వచ్చాయి. ఈ ఏడాది జనవరి 26వ తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాల అమలుకు గ్రామసభలు నిర్వహించారు. ఈ గ్రామసభల సమయంలో అధికారులు చదివి వినిపించిన జాబితాలో తమ పేరు లేదని మరో 23,798 దరఖాస్తులు ప్రజల నుంచి అందాయి. ఇలా మొత్తం 1,03,798 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
యాక్టివేషన్ చేయడంలో ఆలస్యంతో..
జిల్లావ్యాప్తంగా ఎంపిక చేసిన 23 గ్రామాల్లో 2,350 మందికి రేషన్ కార్డులను అందించారు. వీరికి ఫిబ్రవరి నుంచే రేషన్ బియ్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా.. నేటికీ పూర్తిస్థాయిలో అమలు కాలేదు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసిన సన్నబియ్యం పథకం సైతం అందలేదు. కార్డులను పంపిణీ చేసినా.. యాక్టివేషన్ చేయడంలో ఆలస్యం కావడంతో ఏప్రిల్ మాసంలో గ్రామానికి 10 నుంచి 12 మందికే సన్నబియ్యం వచ్చాయి. ప్రభుత్వం దరఖాస్తుదారులందరికీ రేషన్కార్డులు ఇవ్వడంతో పాటు పాతకార్డుల్లో మార్పులు చేర్పులకు అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
జిల్లాలో 1,03,798 మంది దరఖాస్తుదారుల ఎదురుచూపు
ఫ ఇటీవల ఎంపిక చేసిన గ్రామాల్లో 2350 మందికే పంపిణీ
ఫ పథకాలకు రేషన్కార్డే ప్రమాణికంగా తీసుకోవడంతో అర్హుల్లో ఆందోళన
ఫ మార్పులు, చేర్పులకూ అవకాశం ఇవ్వని ప్రభుత్వం
జిల్లాలో రేషన్ కార్డులు
3,24,158
కొత్తగా వచ్చిన
దరఖాస్తులు
1,03,798
ఎంపిక చేసిన గ్రామాల్లో
ఇచ్చినవి 2,350
రేషన్ కార్డులు ఇవ్వాలి
పదేళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలు. కానీ ఇప్పటి వరకు రేషన్ కార్డు ప్రభుత్వం మంజూరు చేయలేదు. ఎన్నోసార్లు దరఖాస్తులు అందించాను. ఇటీవల గ్రామసభలో మా పేరు చదివారు. అయినా ఇప్పటి వరకు కార్డు మంజూరు కాలేదు. అధికారులు కార్డు మంజూరు చేయాలి. రేషన్తో పాటు వివిధ పథకాలు అందడం లేదు.
– డేగల రాజు, ఆత్మకూర్ (ఎస్)

రేషన్కార్డు మాకెప్పుడు!