శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా ఖజానా శాఖలో ఏడుగురు ఉద్యోగుల సస్పెన్షన్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆ ఉద్యోగులకు పాత స్థానాల్లో పోస్టింగ్లు ఇవ్వాలని రాష్ట్ర డైరెక్టర్ ఆదేశించినా జిల్లా ఖజానా అధికారి బేఖాతరు చేయడం చర్చనీయాంశమైంది. ఏ ఇతర శాఖల్లో లేని ఇబ్బందులు, కక్ష సాధింపులు, వివాదాలు ఈ శాఖలో వస్తున్నా యి. రాష్ట్ర డైరెక్టర్ కలగజేసుకుని సమస్యను పరిష్కరించేందుకు ఉత్తర్వులు జారీ చేసి నా ఈ వివాదం ఆగడం లేదు. ఖజానా శాఖలో ఏడుగురు ఉద్యోగుల సస్పెన్షన్, తర్వాత ఆ సస్పెన్షన్ ఎత్తివేయడం, రీ పోస్టింగ్ విషయంలో అవకతవకలు, వివక్షగా వ్యవహరించారని రాష్ట్ర డైరెక్టర్కు ఫిర్యా దులు వెళ్లాక.. వారికి పాత స్థానాల్లోనే పోస్టింగ్లు ఇవ్వాలని డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశా రు. అయితే జిల్లా ఖజానా అధికారి సెలవులో ఉండడంతో పోస్టింగ్లు ఇవ్వలేదు. ఆయన సోమవారం వచ్చినా రీ పోస్టింగ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది. పరిపాలన సమతుల్యం కోసం వారి పాత చోట్లతో పోస్టింగ్ ఇవ్వడం సాధ్యం కాదని ఆయన డైరెక్టర్కు తిరిగి లేఖ రాశారు. దీంతో కథ మొదటికి వచ్చింది.
విధుల్లోకి చేరిన మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుమలత
అరసవల్లి: జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్గా టి.సుమలత సోమవారం జిల్లా బాధ్యతలను స్వీకరించారు. తాజాగా పదోన్నతుల్లో భాగంగా రాజమహేంద్రవరంలో ఏడీగా పని చేస్తూ జిల్లాకు డీడీగా వచ్చారు. సోమవారం ఉదయం ఆమె జిల్లా కార్యాలయాన్ని సందర్శించి ఒకింత ఆందోళనకు గురయ్యారు. పూర్తిగా కూలిపోయే దుస్థితిలో ఉండే ఈ కార్యాలయంలో విధులు ఎలా నిర్వర్తిస్తున్నారంటూ సిబ్బందిని అడిగినట్లుగా సమాచారం. అయితే కొత్తగా కలెక్టరేట్ నిర్మాణంలో భాగంగా మత్స్యశాఖకు కూడా కార్యాలయాన్ని కేటాయించనున్నారని సిబ్బంది ఆమెకు వివరించారు.
మలేరియా నివారణకు జాగ్రత్తలు
శ్రీకాకుళం అర్బన్: ప్రతి ఒక్కరూ మలేరియా నివారణకు తగు జాగ్రత్తలను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.అనిత పిలుపునిచ్చారు. జూన్ మాసం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు మలేరియా నివారణపై అవగాహన ర్యాలీని సోమవారం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 1 నుండి 30వ తేదీ వరకు మలేరియా నివారణకు మాసోత్సవాలు నిర్వహిస్తామన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే దోమల ఉత్పత్తిని అరికట్టడం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. దోమల వల్ల కలిగే డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ఏడు రోడ్ల కూడలి వద్ద మానవహారం నిర్వహించి మలేరియా నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గండం
శ్రీకాకుళం: జిల్లాలోని సుమారు పదివేల మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ గండంగా మారింది. హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు సుప్రీం తాజాగా సమర్థించడంతో 2028 లోగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ కచ్చితంగా పాస్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 12,500 మంది వరకు ఉపాధ్యాయులు ఉండగా.. వీరిలో టెట్ పరీక్ష వచ్చిన తర్వాత విధు ల్లో చేరిన వారు పదివేలకుపైగా ఉన్నారు. మిగిలిన వారంతా అంతకుముందు సర్వీసులోకి వచ్చి ఉండడంతో వీరు మాత్రం టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాల్సిన పరిస్థితి నెలకొంది. టెట్ ఉత్తీర్ణత సాధించే వరకు పదోన్నతులకు కూడా ఉపాధ్యాయులు నోచుకోరు. 2028 నాటికి కూడా టెట్ ఉత్తీర్ణత లేకుంటే స్వచ్ఛంద పదవీ విరమణ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.


