శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో భూగర్భ జల మట్టాలను పెంచి, నీటి భద్రతను కల్పించడమే లక్ష్యంగా ‘జలధార–జలహారతి’ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల స్థాయి బృందాలు, వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలో విజయవంతంగా అమలు చేసిన జలధార కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతి గ్రామంలోనూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన బృందా లు క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా వ్యవహరించాలని, ప్రజలను, సాగునీటి సంఘాలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని సూచించారు. జూలై నాటికి నిర్దేశించిన పనులన్నీ నూరు శాతం పూర్తి కావాలని, ఇందుకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను ఈ నెల 15 లోపు ముగించాల ని స్పష్టం చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. శివారు భూ ములకు సాగునీరు అందేలా డ్రైయిన్లు, కాలువలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, పూడిక తొలగింపు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా మిగులు జలాలను అవసరమైన చోటికి అనుసంధానం చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఇంకుడు గుంతలు, చెక్ డ్యాంల నిర్మాణంపై దృష్టి సారించాలని కోరారు.
సమావేశంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ లవరాజు, ఇరిగేషన్ ఎస్ఈ పొన్నాడ సుధాకర్ రావు, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వంశధార, అటవీ శాఖ అధికారులు, మండల స్థాయి బృందాల సభ్యులు పాల్గొన్నారు.


