● కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: దేశ భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు, ప్రభుత్వ వనరుల శాసీ్త్రయ పంపిణీకి అత్యంత ఖచ్చితమైన జన గణాంకాలే ప్రాతిపదిక అని కలెక్టర్, ప్రిన్సిపాల్ సెన్సస్ అధికారి స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో భారత జన గణన–2027కు సంబంధించి ఫీల్డ్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పదేళ్లకొకసారి నిర్వహించే ఈ మహత్తర ప్రక్రియలో ఫీల్డ్ ట్రైనర్ల బాధ్యత అత్యంత కీలకమని స్పష్టం చేశారు. మార్చి 1, 2027ను సూచిక తేదీగా తీసుకుని నిర్వహించే ఈ గణనలో ఎక్కడా చిన్నపాటి పొరపాట్లకు కూడా తావులేకుండా, క్షేత్రస్థాయిలో వాస్తవ గణాంకాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. సమర్దవంతమైన డేటా సేకరణ ద్వారానే ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పథకాలు రూపొందించడం సాధ్యమవుతుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎస్వీ లక్ష్మణమూర్తి, సెన్సస్ జాయింట్ డైరెక్టర్ బి.వి.ఎల్.సాయి శేఖర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేషన్ అధికారి శివ కుమార్, మాస్టర్ ట్రైనర్లు శేషగిరి, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


