సోంపేట: కొర్లాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని కొర్లాం గ్రామస్తులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు. కొర్లాం గ్రామానికి చెందిన దున్న కృష్ణారావు ఆదివారం రాత్రి పొలానికి వెళ్లగా విష కీటకం కరిచినట్లు గుర్తించారు. వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా ప్రభుత్వ ఆస్పత్రిలో అయితే మందులు ఉచితంగా ఇస్తారని సూచించారు. వెంటనే బాధితుడు కొర్లాం ప్రాథమిక ఆరో గ్య కేంద్రానికి వెళ్లారు. అయితే ఆస్పత్రిలో తలుపులు వేసి ఉండడం గమనార్హం. చాలాసేపు కేకలు వేసినా, డోర్ కొట్టినా సిబ్బంది తలుపు తీయలేదని బాధితుడు ఆరోపించారు. నొప్పి తీవ్రంగా ఉండడంతో హరిపురం ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఏడాదిగా పూర్తిస్థాయి వైద్యుడు లేక ఆస్పత్రిలో సేవలు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఆస్పత్రి ఇన్చార్జి వైద్యుడు భాస్కరరావు స్పందిస్తూ.. ఇకపై ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు.
● ఆపద సమయంలో ప్రభుత్వాస్పత్రిలో
అందని సేవలు
● ఇబ్బంది పడ్డ బాధితుడు


