శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): జిల్లాలో బలవంతపు భూసేకరణ ఆపాలని, ఐటీడీఏ ఏర్పాటు చేయాలని, జీడికి గిట్టుబాటు ధర ఇవ్వాలని, జీడి బోర్డు ఏర్పాటు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని, ఎన్నికల హామీలు అమలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.తులసీదాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆదివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సముద్రతీర ప్రాంతాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని, విలువైన బీచ్ శాండ్ను కార్పొరేట్కు అప్పగించే ప్రయత్నం మానుకోవాలని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. భావనపాడు ఫిషింగ్ హార్బర్, బుడగట్లపాలెంలో జెట్టీ నేటికీ పూర్తికాలేదని గుర్తు చేశారు. జీడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ జిల్లాలో ఐటీ డీఏ లేకపోవడం వల్ల గిరిజనులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, గిరిజన భూములు గిరిజనేతరులు ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు.


