శ్రీకాకుళం : జిల్లా పరిషత్ రోడ్డులోని సుడా కార్గిల్ పార్కులో జరుగుతున్న పనులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం పరిశీలించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫొటో సెషన్, స్పీచ్ పాయింట్ల వద్ద ప్రాక్టికల్ డెమో విధానంలో ఫొటోలు తీయించి పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు సైతం పరిశీలించారు. పెండింగ్ పనులను టీములు వారీగా ఏర్పాటు చేసి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. పార్కు ప్రారంభోత్సవం నాడు ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో సుడా ఎస్ఈ సుగుణాకర్, మున్సిపల్ కార్పొరేషన్ ఎం.ఈ. శర్మ, ఎంహెచ్ఓ సుధీర్, సైనిక్ వెల్ఫేర్ అధికారి ఎ.శైలజ, డీఎస్పీ సీహెచ్ వివేకానంద, డీఎస్డీఓ మహేష్, సుడా ఏఈలు పాల్గొన్నారు.
24న జిల్లా స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్) ఆదేశాల మేరకు ఈ నెల 24న జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జిల్లా స్థాయి శాప్ లీగ్ మాస్టర్స్ (వెటరన్స్) క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీలను మాస్టర్ వెటరన్ అథ్లెట్స్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎ.మహేష్బాబు కోరారు. 35 ఏళ్లుపైబడి, 45 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలకు వేర్వేరుగా వివిధ అథ్లెటిక్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నట్టు చెప్పారు. 100, 400, 800, 1500 మీటర్ల పరుగు, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, డిస్కస్త్రో, జావెలన్త్రో, రిలే పరుగు పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరిచిన వెటరన్ క్రీడాకారులను ఈ నెల 30, 31 తేదీల్లో గుంటూరు జిల్లా కేంద్రంలో జరిగే ఏపీ రాష్ట్ర స్థాయి శాప్లీగ్ మాస్టర్స్ (వెటరన్) పోటీలకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తి గల వెటరన్ అథ్లెట్స్ స్పోర్ట్స్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని డీఎస్డీఓ సూచించారు. వివరాలకు 9390352942 నంబర్ను సంప్రదించాలని కోరారు.
ఒకేసారి మూడు కొలువులు
హిరమండలం: ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చాలా కష్టంగా ఉన్న రోజులివి. అటువంటిది ఒకేసారి మూడు బ్యాంకు కొలువులను సాధించాడు హిరమండలం మండలంలోని పిండ్రువాడ గ్రామానికి చెందిన కురమాన జగదీష్. ఇటీవల విడుదలైన స్టేట్బ్యాంక్ క్లర్క్, యూనియన్ బ్యాంకు క్లర్క్, ఆర్ఆర్బీ క్లర్క్ పోస్టులకు ఎంపికయ్యాడు. తల్లిదండ్రులు నాగేశ్వరరావు, సత్యవతి సాధారణ వ్యవసాయ కూలీలు. జగదీష్ విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే జరిగింది. ఈ సందర్భంగా జగదీష్ను గ్రామస్తులు అభినందించారు.


