పలాస : కార్గో ఎయిర్ పోర్టు ప్రభావిత గ్రామాల్లో ఈ నెల 23 నుంచి 31 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సి.పి.ఐ.ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ నాయకుడు ఎం.రామారావు, కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక కమిటీ అధ్యక్ష కార్యదర్శులు కొమర వాసు, జోగి అప్పారావు చెప్పారు. కాశీబుగ్గ సి.ఐ.టి.యు.కార్యాలయంలో శుక్రవారం కార్గో ఎయిర్ పోర్టు వ్యతిరేక పోరాటానికి సంఘీభావ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి సెగ తగిలేలా చేయాలని పిలుపునిచ్చారు. కార్గో ఎయిర్ పోర్టు పేరుతో ప్రజల సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్గో ఎయిర్ పోర్టు ప్రభావిత ప్రాంతాల్లో సభలు సమావేశాలు పెట్టనీయకుండా ఎందుకు పోలీసు ఆంక్షలు పెడుతున్నారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడిని ప్రశ్నించారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు జీడి మామిడికి గిట్టుబాటు ధర కల్పిస్తామని, జీడి బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకుడు కె.మోహనరావు, రైతు కూలీ సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, సి.ఐ.టి.యు. జిల్లా కార్యదర్శి ఎన్.గణపతి, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్కుమార్, పోరాట కమిటీ మీడియా కన్వీనర్ బత్తిన లక్ష్మణ్, పి.కుసుమ, కె.గురయ్య, పొట్టి ధర్మారావు, గుంటి లోకనాథం, గుంటు రామస్వామి, లండ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.


