కవిటి: మండలంలోని ఒక పంచాయతీలో మానసిక దివ్యాంగురాలిపై అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని కవిటి పోలీస్స్టేషన్లో బుధవారం ఎస్ఐ వి.రవివర్మ కేసు నమోదు చేశారు. ఈ కేసును ఇచ్ఛాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.చిన్నంనాయుడు విచారణ చేశారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
గంజాయి స్వాధీనం
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని బైరిగ్రామం, కరజాడ పరిసర ప్రాంతం మడపాం వంతెన ఇసుక ర్యాంప్ వద్ద బుధవారం రెండు కేజీల గంజాయితో బగ్గు నవీన్, అమర్నాయక్ అనే ఇద్దరు వ్యక్తులను శ్రీకాకుళం రూరల్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రూరల్ ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సివిల్స్ విజేత రాముకు
ఎస్పీ ప్రశంసలు
శ్రీకాకుళం క్రైమ్: సివిల్స్లో 463వ ర్యాంకు సాధించిన జి.సిగడాం మండలం నడిమివలసకు చెందిన సౌరోతు రామును ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ప్రశంసించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. గ్రామీణ ప్రాంతంలోని సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు సివిల్ సర్వీసెస్లో ఉన్నత ర్యాంకు సాధించడం జిల్లాకు గర్వకారణమన్నారు. రాము సాధించిన ర్యాంకు ఆధారంగా ఐపీఎస్, ఐఏఎస్ సేవల్లో ఎంపికయ్యే అవకాశాలున్నాయన్నారు. భర్తను కోల్పోయినా కృంగిపోకుండా రాము తల్లి కూలి పనులు చేస్తూ.. కుటుంబాన్ని పోషిస్తూ కొడుకును ఉన్నతస్థాయికి తీసుకెళ్లడం అభినందనీయమని కొనియాడారు. జిల్లా యువత రామును ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.


