శ్రీకాకుళం పాతబస్టాండ్: అమ్మాయిలపై బంధువులు, స్నేహితులు లేదా ప్రయాణాల్లో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, శరీర భాగాలపై అనుచితంగా చేతులు వేసినా భయపడకుండా వెంటనే ఎదురించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి కె.హరిబాబు సూచించారు. నగరంలో ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని ఆర్సీఎం సెయింట్ జాన్స్ స్కూల్లో విద్యార్థులకు గుడ్ టచ్ – బ్యాడ్ టచ్పై బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాలల భద్రత కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (నాల్సా) రూపొందించిన స్నేహ పూర్వక న్యాయ సేవలు వారి రక్షణకు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఆపదలో ఉన్నప్పుడు లేదా వేధింపులకు గురైనప్పుడు విద్యార్థులు వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098, పోలీసు 100 లేదా ఉచిత న్యాయ సేవల నంబర్ 15100కు సమాచారం అందించాలని సూచించారు. పిల్లలు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో న్యాయవాది జి.ఇందిరా ప్రసాద్, సిస్టర్ జ్యోత్స్న, టి.సుమంజలి పాల్గొన్నారు.


