● జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్
● పీజీఆర్ఎస్కు 117 అర్జీలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: ప్రజల నుంచి వచ్చే వినతులకు సకాలంలో పరిష్కారం చూపాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సూచించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. దీనిలో భాగంగా 117 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీదారుల సమస్యలను పరిశీలించి నాణ్యమైన పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నందున జాప్యంలేకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. అధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 23, పంచాయతీరాజ్కు సంబంధించి 13, వ్యవసాయ శాఖకు సంబంధించి 13, సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన)కు సంబంధించి 12 వినతులు అందాయి. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ దొనక పృథ్వీరాజ్, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకుడు ఎన్.కిరణ్ కుమార్, జెడ్పీ సీఈవో పి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రెవెన్యూ క్లినిక్ సందర్శన
ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) నిర్వహించిన అనంతరం జెడ్పీ సమావేశ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ను జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సందర్శించారు. ప్రజల నుంచి వచ్చిన భూ సంబంధిత సమస్యల పరిష్కార స్థితిగతులను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. భూ సమస్యలను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు బి.లవరాజ్, డిప్యూటీ కలెక్టర్ డి.పద్మావతి, జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి వీఎస్ఎస్ఎల్ ప్రసన్న, జిల్లా పంచాయతీ రాజ్ పర్యవేక్షక ఇంజినీర్ కేవీ నాయుడు, జిల్లా గ్రామీణ నీటి సరఫరా పర్యవేక్షక ఇంజినీర్ పి.సుధాకర్ బాబు, జిల్లా పంచాయతీ అధికారి గోపిబాల, వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుడు కె.త్రినాథరావు, భూగర్భ గనుల శాఖ ఉప సంచాలకుడు సి.మోహన్రావు, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.అనిత, సర్వశిక్షా అభియాన్ ఏపీసీ పి.వేణుగోపాల్, జిల్లా ఉపాధి కల్పన అధికారి కె.సుధా, మెప్మా పథక సంచాలకుడు ఎస్.వెంకటరావు, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి కె.సూర్య ప్రకాష్, ఎస్సీ కార్పొరేషన్ డిప్యూటీ డైరెక్టర్ వి.వినాయకం, జిల్లా కార్మిక శాఖ అధికారి కె.అజయ్ కార్తికేయ, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్రావు, ఉద్యానవన శాఖ సహాయ సంచాలకుడు వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కొన్ని ఫిర్యాదులు పరిశీలిస్తే..
● శ్రీకాకుళం రూరల్లోని పెద్దపాడు గ్రామంలో తాగునీటి కొరత ఉందని, సమస్యను పరిష్కరించాలని గ్రామానికి చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు.
● రిమ్స్లో కార్మికులకు రిమ్స్ కాంట్రాక్టర్ ఇబ్బందులు పెడుతున్నారని, జీతం ఇవ్వడం లేదని, ఇతర సంక్షేమాలు చూడడం లేదని కార్మికులు ఫిర్యాదు చేశారు. దీనిపై కాంట్రాక్ట్రర్కు పల మార్లు విన్నవించుకున్నా ఫలితం లేదన్నారు.
● శ్రీకాకుళం మండలంలోని కరజాడలో డ్రైనేజీ నిర్మాణ పనులు జరగకుండా కొంతమంది ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని గ్రామానికి చెందిన బలగ లక్ష్మణరావు తదితరులు ఫిర్యాదు చేశారు.


