రణస్థలం: అతివేగం ఒక కన్నతల్లికి కడుపుకోతను మిగిల్చింది. మండలంలోని వరిసాం సమీపంలో జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురై లంక మోహన్ (18) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో యువకుడు మైలపల్లి లక్ష్మణ తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. జేఆర్పురం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పైడిభీమవరం నుంచి రణస్థలం వైపు సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతివేగంగా ద్విచక్ర వాహనంపై మైలపల్లి లక్ష్మణ, లెంక మోహన్(చందు) వస్తున్నారు. వారు వరిసాం సమీపానికి వస్తున్న సమయంలో సర్వీస్ రోడ్డు నుంచి హైవే రోడ్డు ఎక్కేందుకు ఒక ప్రైవేటు స్కూల్ బస్సు వస్తూ మలుపు తిరుగుతోంది. ఆ సమయంలో అతివేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం స్కూల్ బస్సు వెనుక ఢీకొట్టి.. అదుపుతప్పి డివైడర్ను బలంగా గుద్దుకున్నారు. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక కూర్చున్న మరువాడ గ్రామానికి చెందిన మోహన్ప్రమాద స్థలంలోనే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న కొవ్వాడ గ్రామానికి చెందిన మైలపల్లి లక్ష్మణకు తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉన్న లక్ష్మణను 108 వాహనంపై శ్రీకాకుళం రిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా బైక్ నడుపుతున్న లక్ష్మణను జేఆర్పురం పోలీసులు పలుమార్లు హెచ్చరించినా పరిస్థితి మారలేదు. మృతుడు రణస్థలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి లంక రామారావు కూలీ పనులు చేస్తుండగా.. తల్లి శారద ఆదర్శ పాఠశాలలో వంట పని చేస్తోంది. ఈ ప్రమాదంతో మరువాడ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. తండ్రి రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్పురం ఎస్ఐ ఎస్.చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


