పాతపట్నం: సీతంపేట ఐటీడీఏ పరిధిలోని గిరిజన రహదారి నిర్మాణ పనులపై పలువురు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు అందడంతో, సెంట్రల్ విజిలెన్స్ అధికారులు రహదారుల నిర్మాణాల పనులను పరిశీలించారు. గురువారం మండలంలోని నల్లబొంతు గిరిజన గ్రామానికి ఉపాధి హామీ పథకం కింద రూ.కోట్లతో ఇటీవల నిర్మాణం చేపట్టిన రహదారిని పరిశీలించారు. బీటీ, సిమెంట్, మెటల్ రోడ్లును పరిశీలిస్తున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి మండలంలోని పలు రహదారులను పరిశీలించనున్నట్లు తెలిపారు. సాంకేతిక ఆమోదానికి అనుగుణంగా ప నులు జరిగాయా లేదా? అని చూస్తున్నారు. రోడ్డు పొడవు, వెడల్పులు, ఎం బుక్లోని వివరాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని నిశితంగా గమనిస్తున్నారు. విజిలెన్స్ అధికారులు పనులకు, రికార్డులకు తేడాలను పరిశీలిస్తున్నారు. ఏమైనా లోపాలు బయటపడితే సంబంధిత అధికారులు, కాంట్రాక్టులపై చర్యలకు ఉన్నతాధికారులకు తెలియజేస్తారని తెలిపారు. తనిఖీల్లో డ్వామా పీడీ బి.లవరాజు, ఐటీడీఏ డీఈఈ వర్మరాజు, ఎంపీడీఓ రమణమూర్తి, ఏపీఓ సురేష్, సర్పంచ్ మార్కండేయులు, ఏఈలు పాల్గొన్నారు.


