దగా పడ్డ ఆడబిడ్డ
● మహిళా సంక్షేమాన్ని విస్మరించిన చంద్రబాబు ప్రభుత్వం
● ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిన వైనం
శ్రీకాకుళం పాత బస్టాండ్: రాష్ట్రంలో ఆడబిడ్డ దగా పడింది. ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా రెండేళ్లు కావస్తున్నా మహిళలకు సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ఏడాది బడ్జెట్లో మహిళా సంక్షేమం ఊసే లేదు.
ఏటా రూ.18వేలు ఏదీ..?
ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఊరూరా తిరిగి, పోస్టర్లు వేసి మరీ 18 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని ప్రచారం చేశారు. ప్రభుత్వం వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఈ పథకానికి ఒక్క పైసా కూడా కేటాయించకపోవడం చంద్రబాబు ప్రభు త్వ నిర్లక్ష్య వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం. అలాగే మహిళా సంఘాలకు బ్యాంకు రుణాలపై సున్నావడ్డీ రాయితీ ఇవ్వలేదు. ఆ సంఘాల సభ్యులు ప్రోత్సాహం లేక రుణబాధలతో ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వితంతు పింఛన్లు ఇవ్వడం ఆపేశారు. వాటి కోసం బడ్జెట్లోనూ ప్రస్తావన లేదు.
గతమంతా ఘనం..
● వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో మహిళలు ఆర్థికంగా సాంఘికంగా ఎంతో ప్రగతి సాధించారు. ఆర్థిక స్వావలంబనతో పాటు పలు మహిళా సంక్షేమ పథకాలు వారి గడప వద్దకు వచ్చి తలుపు తట్టేవి. ప్రతి పథకానికి నాడు జగన్మోహన్ రెడ్డి ఒక క్యాలెండర్ రూపొందించి క్యాలెండర్ ప్రకారం పథకాల అమలు చేసేవారు.
● వైఎస్సార్ ఆసరా కింద నాలుగు విడతల్లో మహి ళా సంఘాలు వాడిన బ్యాంకు రుణాలను చెల్లించేవారు. నాలుగు విడతల్లో రూ.1240 కోట్లు మహిళలకు ఆర్థిక సాయం అందించారు.
● కాపు నేస్తం పేరిట జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు నాలుగేళ్లలో రూ.28.20 కోట్లను అందజేశారు.
● ఈబీసీ నేస్తం పేరిట అగ్రకులాలకు చెందిన 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సుగల మహిళలకు ఏటా రూ.15 వేలు వంతునా, నాలుగేళ్ల పాటు జిల్లాలో 7,514 మందికి రూ.11.27 కోట్లను వారి సొంత బ్యాంకు ఖాతాల్లో జమచేశారు.
● వైఎస్సార్ చేయూత ద్వారా ఏడాదికి రూ.18750 లు వంతున నాలుగు విడతల్లో రూ.1485.2 కోట్లను అందజేశారు.
● ఇక జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు నేరుగా బ్యాంకుల నుంచి రూ.10,000 వడ్డీ లేని రుణాలు అందించారు.


