‘కార్పొరేట్లకు భూములివ్వడమే అభివృద్ధా..?’
మందస:
కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో ప్రజల భూములను కొల్లగొట్టి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడమే అభివృద్ధా అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, లిబరేషన్ జిల్లా నాయకులు మద్దిల రామారావు, కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరా ట కమిటీ నాయకులు కొమర వాసు, జోగి అప్పారావు ప్రశ్నించారు. మందస మండలం గంగువాడ గ్రామంలో కార్గో ఎయిర్పోర్టు వ్యతిరేక పోరాట కమిటీ విస్తృత స్థాయి సమావేశం కొమర వాసు అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి అంటే భూములు కొల్లగొట్టడం కాదన్నారు. మూడు సార్లు ఎంపీగా, ఒకసారి మంత్రిగా మీరు జిల్లాకు చేసిందేమిటని సూటిగా ప్రశ్నించారు. జిల్లాలో ఉన్నా పెండింగ్ ప్రాజెక్ట్లు పూర్తిచేస్తే బాగుంటుందన్నారు. మా ఊరు–మాభూమి–మా ఊపిరి పరిరక్షణకై ఈ నెల 28వ తేదీన ఒంకులూరు గ్రామంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28 వరకు చైతన్య యాత్రలు చేపట్టాలని తీర్మానించారు.


