ఎగిరెగిరిపడుతున్న రాజకీయ పాసు!
రథసప్తమి నకిలీ పాసుల కుంభకోణం
విచారణపై నీలినీడలు
ప్రస్తుతానికి ఏడుగురికే పరిమితమైన విచారణ
మిగతా కీలక అనుమానితుల
పరిస్థితేంటో నేతలకే ఎరుక
10రోజులుగా కేసును విచారిస్తున్న
సీసీఎస్, టాస్క్ఫోర్స్లను
అర్థాంతరంగా తప్పించిన వైనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
రథసప్తమి వేడుకల నకిలీ వీఐపీ, వీవీఐపీ పాసుల కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రథసప్తమి వేడుకలు ముగిసిన మరుసటి రోజు కేసును టేకప్ చేసిన సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులు కేసులో ఎంతమందికి ప్రమేయం ఉంది? వెనకుండి నడిపింది ఎంతమంది? అన్నది విచారణలో తెలుసుకుని ఉన్నతాధికారులకు అప్పగించారు. అయితే శుక్రవారం పోలీస్ స్పోర్ట్స్ మీట్కు ఓ ఉన్నతాధికారి రావడం, ఆ వెంటనే పరిణామాలు మారిపోవడం, రాత్రికి రాత్రే అర్థాంతరంగా కేసును కాస్తా సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసుల నుంచి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్కు బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయం ఒకటో పట్టణ పరిధిలో కావడంతోనే అక్కడికి బదిలీ చేశారు. మొదటి నుంచి కేసుతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న 13 మందిలో ఏడుగురినే ఫిక్స్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు, మిగతా ఆరుగురిని తప్పించే యోచనలో ఉన్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
రథసప్తమి రోజున ఆలయానికి అనుకోని రీతిలో భక్తులు పోటెత్తడం, మరో భారీ తొక్కిసలాట త్రుటిలో తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడే పోలీసుల పోస్టుమార్టం మొదలైంది. నిజం బహిర్గతమైంది. దేవాలయం అధికారులు జారీ చేసిన వీఐపీ, వీవీఐపీ పాసులను కొందరు వేలల్లో నకిలీవి సృష్టించడంతోనే ఈ దుర్గతి పట్టిందని తెలియడంతో ఎస్పీ మహేశ్వరరెడ్డి ఆగమేఘాల మీద ప్రత్యేక విభాగాలైన సీసీఎస్, టాస్క్ఫోర్స్ పోలీసులతో విచారణ చేయించారు. విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళంతో పాటు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేశారు. నకిలీ పాసులు ముద్రించారన్న సమాచారం మేరకు పలు ప్రింటింగ్ ప్రెస్లను, జెరాక్స్ సెంటర్ల ప్రతినిధులను విచారించారు. దాదాపు 10 రోజులకు పైగా జరిగిన తమ విచారణలో మణికంఠ జిరాక్స్, ప్రింటింగ్ సెంటర్తో పాటు కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, నేతల అనుచరులు, సిబ్బంది, రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లో కొంతమందిని విచారించారు. వీరిలో కొందరి పాత్రను కూడా నిర్ధారణ చేశారు.
ఈ కేసుకు సంబంధించి మొదటి నుంచి పోలీసులపై తీవ్ర రాజకీయ ఒత్తిడి నడుస్తూనే ఉంది. కొంతమంది నేరుగా స్టేషన్కు వెళ్లి కూడా ఒత్తిడి చేసిన సందర్భాలున్నాయి. స్థానిక కీలక ప్రజాప్రతినిధైతే కొంతమంది మీడియా ప్రతినిధులకు ఫోన్ చేసి ఏమీ రాయొద్దన్నట్లు ప్రచారం కూడా సాగింది. కీలక నేతల ఒత్తిళ్లతోనే కేసులో అనుమానితులుగా ఉన్న స్థానిక కీలక నేత సోదరుడు, జిల్లాలోని ఓ పెద్ద నేతకు వ్యక్తిగత ఇన్ఫ్లూయెన్సర్గా కొనసాగుతున్న వ్యక్తి, రణస్థలానికి చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి, కీలక నేతలను, సిబ్బందిని తప్పించారనే అనుమానాలు ఉన్నాయి. మణికంఠ జిరాక్స్ సెంటర్కు సంబంధించి తండ్రీకొడుకులనే కాక, ఆపరేటర్ను, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ముగ్గురిని, దేవదాయశాఖకు చెందిన ఒకరిని ప్రస్తుతం విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమేయం ఉందని భావిస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లలో ‘ప్రశాంత’ంగా కథ నడిపిన వ్యక్తి కూడా ఉన్నారు. కాక పోతే ఇన్ని రోజులు విచారణ జరిపి కొండను తవ్వి ఎలుకను పట్టే చందంగా చివరి నిమిషంలో ఇలా కేసును వేరే స్టేషన్కు అప్పగించి, రాజకీయ ఒత్తిళ్లతోనే కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి.
ఎగిరెగిరిపడుతున్న రాజకీయ పాసు!
ఎగిరెగిరిపడుతున్న రాజకీయ పాసు!


