జీడిమామిడి సాగుతో గిరిజన రైతులకు అధిక ఆదాయం
ఆమదాలవలస: జీడిమామిడి సాగుతో గిరిజన రైతులకు అధిక ఆదాయం లభిస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ డాక్టర్ జి.శివన్నారాయణ అన్నారు. ఆమదాలవలస పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో డైరెక్టరేట్ ఆఫ్ కాష్యూ నట్ అండ్ కోకో డెవలప్మెంట్, కొచ్చిన్ వారి ఆర్థిక సహకారంతో జిల్లా స్థాయి జీడిమామిడి సదస్సును శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ జీడిమామిడి గిరిజన రైతులకు ముఖ్య ఆదాయ వనరుగా మారిందని, సరైన సాగు యాజమాన్య పద్ధతులు అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. అంతర పంటలు వేసుకోవడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చునని అన్నారు. జీడి పళ్లు, జీడిపిక్కల నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తే రైతుల ఆదాయం మరింత పెరుగుతుందని వివరించారు. కేవీకే కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ కె.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ జీడి పండ్లతో సిరప్, జామ్, జెల్లీ, క్యాండీ, పచ్చడి తయారీ విధానాలపై అవగాహన కల్పించారు. సదస్సులో జిల్లా నలుమూలల నుంచి రైతులు, ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ జీఎస్ రాయ్, డాక్టర్ సీహెచ్ బాలకృష్ణ, డాక్టర్ ఎస్.కిరణ్ కుమార్, డాక్టర్ బి.సునీత తదితరులు పాల్గొన్నారు.


