స్థలం పవిత్రతను దెబ్బ తీయవద్దు
పలాస: కాశీబుగ్గ కె.టి.రోడ్డులో శ్మశాన వాటిక గోడకు ఆనించి చిరు వ్యాపారులు షాపులు పెట్టడం తగదని, అది తమ పవిత్ర స్థలమని కాశీబుగ్గ క్రిస్టియన్, ముస్లిం సంఘాల నేతలు చెప్పారు. ఫుట్పాత్పై పెట్టడం కూడా తగదన్నారు. రోడ్డుపై షాపులు పెట్టుకుంటే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పారు. కాశీబుగ్గ పల్లివీధిలోని చర్చిలో శనివారం యునైటెడ్ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కమిటీ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వందేళ్ల క్రితం తర్లాకోట రాజు శ్మశాన స్థలం తమకు దఖలు పరిచారన్నారు. మురికికాలువ, ఫుట్పాత్, రోడ్డు విస్తరణ కోసమంటూ ఇప్పటికే శ్మశాన స్థలం ఇచ్చామని చెప్పారు. ఇటీవల మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు రోడ్డుపై ఉన్న దుకాణాలను తొలగించడంతో వారంతా శ్మశాన వాటిక గోడను ఆనుకుని ఉన్న ఫుట్పాత్పైకి వచ్చేశారన్నారు. కొందరు పర్మినెంటు షాపులు కూడా కడుతున్నారని, సాయంత్రం, రాత్రి వేళల్లో మద్యం తాగి సీసాలను, వాటర్ బాటిళ్లు, ఇతర చెత్తను వేస్తూ డంపింగ్యార్డులా తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడా క్రిస్టియన్ శ్మశానాల గోడల పక్కన షాపులు లేవని, ఇక్కడే ఎందుకు కొత్త సంస్కృతి మొదలైందన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. సమావేశంలో క్రిస్టియన్, ముస్లిం పెద్దలు అనిల్కుమార్రాజు, పయ్యజ్ అహ్మద్, డి.వి.డి.వి.కుమార్, మురళి, జాన్సన్, బి.ఐ.కుమార్, అప్పలస్వామి, ధర్మారావు, కె.జయ, స్టీపెన్పాల్ తదితరులు పాల్గొన్నారు.


