జీవితాల్లో వెలుగు లేక..!
తక్కువ వేతనంతో పని
హిరమండలం: జిల్లాలో చిరుద్యోగులు ఉద్యమబాట పట్టారు. విద్యుత్ మీటర్ల రీడింగ్ తీసేవారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి సమ్మెకు దిగారు. దీంతో ఫిబ్రవరి నెలకు సంబంధించి విద్యుత్ మీటర్ రీడింగ్ ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో విద్యుత్ శాఖ ఆందోళన చెందుతోంది. సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు ( గ్రేడ్–2 లైన్మెన్ల)తో రీడింగ్ తీసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుండడంతో వారు కూడా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే పని ఒత్తిడిలో తాము ఉంటే.. రీడింగ్ పని చేయలేమని తేల్చి చెబుతున్నారు. దీంతో ఏం చేయాలో పాలుపోక విద్యుత్ శాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు సుమారు 7.37 లక్షలు ఉన్నాయి. ఇందులో గృహ, వాణిజ్య మీటర్లకు చిరుద్యోగులు రీడింగ్ తీస్తుంటారు. ఇలా జిల్లావ్యాప్తంగా 235 మంది వరకూ రీడింగ్ తీసేవారు ఉన్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్ల పరిధిలో ఒక్కొక్కరూ 3,000 మీటర్లకు రీడింగ్ తీస్తుంటారు. అయితే తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే కాంట్రాక్ట్ ఉద్యోగులుగా వారిని గుర్తిస్తామని కూటమి నేతలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు సమీపిస్తున్నా ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాలేదు. ఏడాది కిందట ఇదే మాదిరిగా మీటర్ రీడింగ్ తీసేవారు రీజియన్ల వారీగా ఆందోళనకు దిగారు. సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే రకరకాల కారణాలు చెప్పి ప్రభుత్వం వారి నోరు మూయించింది. అయితే కాలం గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వారు సమ్మెబాట పట్టారు.
నేను కొన్నేళ్లుగా మీటర్ రీడింగ్ తీస్తున్నాను. కనీసం కాంట్రాక్ట్ ఉద్యోగిగా గుర్తిస్తారన్న నమ్మకంతో పనిచేస్తున్నాను. జీతం నెలనెలా సక్రమంగా అందించడం లేదు. అందుకే కమీషన్ పెంచడంతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నాం.
– పెద్దకోట జనార్దనరావు,
మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగి, ఎల్ఎన్పేట
మాకు చాలా అన్యాయం జరుగుతోంది. ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీస్తే కనీసం గిట్టుబాటు కావడం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి కమీషన్ పెంచుతామని హామీ ఇచ్చారు. 20 నెలలుగా ఎదురుచూస్తున్నా ఫలితం లేకపోయింది. అందుకే సమ్మెబాట పట్టాం. – ప్రసాద్ మహోపాత్రో,
మీటర్ రీడింగ్ తీసే ఉద్యోగి, హిరమండలం
సమ్మెబాట పట్టిన విద్యుత్ మీటర్ రీడింగ్ ఉద్యోగులు
కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని కూటమి హామీ
20 నెలలుగా కార్యరూపం దాల్చకపోవడంతో ఆందోళన
ప్రారంభమవ్వని ఫిబ్రవరి నెల రీడింగ్
మీటర్ల రీడింగ్ తీసేవారు చాలా తక్కువ వేతనానికి పనిచేస్తున్నారు. గతంలో విద్యుత్ శాఖ సిబ్బంది ఈ రీడింగ్ తీసే క్రమంలో ఇతర పనులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. అందుకే ఈ రీడింగ్ తీసే బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించారు. ఈ ఏజెన్సీలు చిరుద్యోగులను నియమించుకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో విద్యుత్ మీటరు రీడింగ్ తీస్తే రూ.3.70లు, పట్టణ ప్రాంతాల్లో తీస్తే రూ.3.60లు ఇస్తున్నారు. అయితే ఇలా రీడింగ్ తీస్తున్న క్రమంలో వీరికి వేతనాలు సక్రమంగా అందించడం లేదు. ఇచ్చిందే తక్కువ కాగా సంబంధిత కాంట్రాక్టర్ జీతాలు సక్రమంగా సకాలంలో ఇవ్వడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే నేరుగా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించి.. కమీషన్ను భారీగా పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప హామీ అమలు చేసే దాఖలాలు కనిపించడం లేదు.
జీవితాల్లో వెలుగు లేక..!
జీవితాల్లో వెలుగు లేక..!


