‘మాదిన’కు జాతీయ అవార్డు
కంచిలి: మండలంలోని పెద్దశ్రీరాంపురం గ్రామానికి చెందిన విశాఖపట్నం పశువైద్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ మాదిన ప్రసాదరావుకు పశువైద్య రంగంలో అత్యున్నత స్థాయిలో సేవలు అందించిన పశువైద్యులకు జాతీయ స్థాయిలో ఇచ్చే డాక్టర్ సీఎం సింగ్ సుశృత గౌరవ్ రత్న సమ్మాన్ 2025 అవార్డులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎంపిక చేశారు. ఈ అవార్డులను వెటర్నరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(వీఏఐ) ఎంపిక చేసినట్లు ప్రసాదరావు తెలిపారు. ఈ అవార్డుకు తనతోపాటు ఒంగోలు వెటర్నరీ పాలీ క్లినిక్లో డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ నల్లపాటి జగత్ శ్రీనివాస్కు కూడా ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ అవార్డులను ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధకశాఖ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ దామోదరనాయుడు చేతులమీదుగా సోమవారం అమరావతిలో రాష్ట్ర కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్లు డాక్టర్ రత్నకుమారి, డాక్టర్ రజనీకుమారి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భూపాల్రెడ్డి పాల్గొన్నారు.
సచివాలయం పరిశీలన
జి.సిగడాం: మండలంలోని బాతువ గ్రామ సచివాలయాన్ని అదనపు ట్రైనీ కలెక్టర్ డి.పృథ్వీరాజ్ కుమార్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. రికార్డుల నిర్వహణ, పనితీరుపై ఆరా తీశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో అలసత్వం వహించవద్దన్నారు. సిబ్బంది సమర్దవంతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆయనతో పాటు డిప్యూటీ తహసీల్దార్ ఎన్.నిర్మల, ఆర్ఐ అబోతుల రాధ, సర్వేయర్ శాంతారావు తదితరులు ఉన్నారు.
ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తికి గాయాలు
శ్రీకాకుళం క్రైమ్: నగరంలోని 80 ఫీట్ రోడ్డులో వాకింగ్ చేస్తున్న వ్యక్తిని వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొనడంతో గాయాలయ్యాయి. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరానికి చెందిన సువ్వారి కృష్ణ అనే వ్యక్తి ఆదివారం 80 అడుగుల రహదారిలో వాకింగ్ చేస్తున్నారు. అదే సమయంలో ఒక ద్విచక్ర వాహనంపై అతివేగంగా వచ్చిన వ్యక్తి మద్యం మత్తులో ఢీ కొట్టడంతో సువ్వారి కృష్ణకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితుడిని రిమ్స్కు తరలించారు. కృష్ణ ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్ఐ దండపాణి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
తప్పిన ప్రమాదం
సరుబుజ్జిలి: సరుబుజ్జిలి జంక్షన్ వద్ద సోమవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పింది. సరుబుజ్జిలి నుంచి హిరమండలం వైపు ద్విచక్ర వాహనంతో వెళ్తున్న యువకుడు సరుబుజ్జిలి జంక్షన్ దాటుతున్న సమయంలో వాహనం అదుపు తప్పడంతో పల్టీలుకొట్టింది. ఈ సమయంలో ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టాడు. అయితే ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు అవ్వకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
శ్రీకాకుళం: నగరపాలక సంస్థకు మంజూరవుతున్న ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటివరకు మంజూరైన 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయకపోవడంతో ఈ నెలాఖరు నాటికి అవి మురిగిపోయే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే తక్షణమే ఈ నిధులను ఖర్చు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అయితే అధికారులు దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా అధికారులకు సిబ్బంది సహకరించకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో ఆర్థిక సంఘం మంజూరు చేసిన నిధులతో అధికారులు పంపిన పనులకు సంబంధించిన అంచనాలను ప్రభుత్వం ఆమోదించింది. వీటికి టెండర్లు కూడా పూర్తయినప్పటికీ పనులు చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్ల అవి పెండింగ్లో ఉండిపోయాయి. నిబంధనల ప్రకారం వీటిని రద్దుచేసి కొత్త్త పనులకు ప్రభుత్వం నుంచి ఆమోదం పొంది వాటిని చేపట్టాల్సి ఉంది. పాత పనులను రద్దుచేసి కొన్ని కొత్త పనులకు ప్రభుత్వ ఆమోదం పొందినా.. ఇప్పటివరకు వీటికి సంబంధించిన టెండర్లను పిలవకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే కోట్లాది రూపాయులు వృథాగా మురిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా ఉండిపోయిన నిధులు సుమారు రూ.20 కోట్లకు పైబడి ఉండవచ్చని తెలుస్తోంది. శ్రీకాకుళం నగరపాలక సంస్థకు 2010 నుంచి పాలకవర్గం లేకపోవడంతో ఆర్థిక సంఘం నిధులు మంజూరునకు కేంద్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అందువలన నిధుల ఖర్చుకు ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
‘మాదిన’కు జాతీయ అవార్డు
‘మాదిన’కు జాతీయ అవార్డు


