ఆగని దోపిడీ
న్యూస్రీల్
శ్రీకాకుళం
● రైతుల నుంచి అదనంగా ధాన్యం తీసుకుంటున్న మిల్లర్లు
● సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న రైతులు– మిల్లర్ మధ్య సంభాషణ వీడియో
సోమవారం శ్రీ 5 శ్రీ జనవరి శ్రీ 2026
కంచిలి:
రైతులు పంట విక్రయానికి ఎన్ని అవస్థలు పడుతున్నారన్నది ఒక్క వీడియోతో తేటతెల్లమైపోయింది. ట్రక్షీట్ జనరేట్ అయిన తర్వాత మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని దించడానికి మిల్లరు రకరకాల కొర్రీలు పెడుతూ రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. ధాన్యం నాణ్యతపై అభ్యంతరం ఉందంటూ సరకు దించకుండానే రైతుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై జిల్లావ్యాప్తంగా రైతులు, ప్రజాప్రతినిధులు జెడ్పీ సర్వసభ్య సమావేశంలో సైతం సాక్షాత్ కలెక్టర్ దృష్టిలో పెట్టిన సంగతి విదితమే. కానీ మిల్లర్ల వ్యవహార శైలిలో ఏ మాత్రం మార్పు లేదు సరికదా మరింతగా రెచ్చిపోతున్నారు.
దీనికి కంచిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలోని స్వప్న రైస్ మిల్లు యజమాని కిల్లంశెట్టి మోహనరావు రైతులతో వ్యవహరించిన తీరు ప్రత్యక్ష ఉదాహరణగా చెప్పవచ్చు. రైతుల తెచ్చిన ధాన్యానికి వంకలు పెడుతూ 80 కిలోల బస్తా బదులుగా 92 కిలోలు ఇస్తేనే అనుమతిస్తానంటూ హుకుం జారీ చేస్తున్నారు. అదనంగా 12 కిలోలు ఇస్తేనే అన్లోడింగ్ చేస్తానంటే.. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని అమ్ముకొనేందుకు ఆత్మాభిమానం చంపుకొని వ్యాపారి చేతులు పట్టుకొని బతిమలాడటం కనిపించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మిల్లు యజమానికి మద్దతుగా టీడీపీ నేతలు ప్రవేశించడం, స్థానిక కూటమి ఎమ్మెల్యే బెందాళం అశోక్ దృష్టికి వెళ్లడంతో ఆయన కూడా స్తబ్ధుగా ఉంటూ మిల్లర్కు కొమ్ముకాస్తున్నా రని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతులకు తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. జిల్లావ్యాప్తంగా అదనంగా 3 కిలో లు, 4 కిలోలు నుంచి ఏకంగా 12 కిలోలు అదనంగా అడుగుతుండటంపై ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా కొమ్ముకాస్తున్నారో ఈ వ్యవహారంతో అవగతమవుతుంది.
‘పండించిన ధాన్యం నాణ్యత బాగోలేదు. నేనేం చేయలేను. నష్టం వస్తే ఎవరు భరిస్తారు. నువ్వు తెచ్చిన ధాన్యంలో పొల్లు, నూకలే 50శాతం ఉన్నాయి. రైతు అభ్యంతరం చెబుతుంటే 40శాతం ఉన్నాయా అంటూ.. రామారావు(టీడీపీ నేత), ఎమ్మార్వో చెప్పారు కదా. 92 కిలోలు ఇస్తేనే తీసుకొంటాను. మీకు ఇందులో ఎలాంటి నష్టం రాదు.’
– కంచిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలో స్వప్న ట్రేడర్స్ రైస్ మిల్లు వద్ద యజమాని కిల్లంశెట్టి మోహనరావు ధాన్యం తీసుకొచ్చిన రైతుతో జరిపిన సంభాషణ ఇది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆగని దోపిడీ
ఆగని దోపిడీ


