
బకాయిల భారం భరించలేం!
రూ.80 కోట్లు పెండింగ్..
● రేపటి నుంచి మూతపడనున్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలు
● ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వ తీరుకు నిరసనగా తరగతుల బంద్
శ్రీకాకుళం న్యూకాలనీ: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా సోమవారం నుంచి ప్రైవేటు డిగ్రీ కళాశాలలు మూతపడనున్నాయి. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పాఠశాల విద్యను గాలికొదిలేసింది. ఇంటర్మీడియెట్ విద్యను పెద్దగా పట్టించుకున్నదాఖలాలు కనిపించడంలేదు. ఇక డిగ్రీ కాలేజీ విద్యపై ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. మొన్నటి వరకు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ను సైతం వెలువరించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇక 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఐటీఐ, పాలిటెక్నిక్ ఇతర వృత్తివిద్య కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేదు. గత 16 నెలలుగా సీఎంను, డిప్యూటీ సీఎం, విద్యాశాఖామంత్రును పలుమార్లు కలిసినా అతీగతీ లేదని సంఘ నాయకులు వాపోతున్నారు.
నిర్వహణ భారం భరించలేక..
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయలేక, ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు రాక కాలేజీల నిర్వహణ భారంగా మారింది. భవనం అద్దెలు, అధ్యాపకుల జీతాలు, కరెంట్బిల్లులు, అఫ్లియేషన్ ఫీజులు, కళాశాలల రోజువారి నిర్వహణ తలకు మించిన భారంగా మారడంతో ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని ఏపీ ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులను భయపెట్టి, బాధపెట్టి సాధించిందేమీలేదని భావించి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పందించే వరకు కాలేజీల్లో తరగతులు రద్దు చేయాలని నిర్ణయించింది. ఈనెల 14న రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో తీసుకున్న ఏకగ్రీవ తీర్మానం మేరకు ఈ నెల 22 నుంచి ప్రైవేటు డిగ్రీ కాలేజీలు మూడపడనున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రైవేటు డిగ్రీ కాలేజీలను మూసివేస్తామని సంఘ నాయకులు స్పష్టంచేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ నిధుల విషయమై ప్రభుత్వ పెద్దలు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కలిసిన ఉపయోగం లేకపోయింది. విద్యార్థులను ఫీజులు చెల్లించమని ఒత్తిడి చేయలేక, ప్రభుత్వం నిధులు విదల్చక కాలేజీల నిర్వహణభారం కష్టంగా మారింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో రాష్ట్రంతోపాటు శ్రీకాకుళం జిల్లాలోను ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో క్లాసులను నిర్వహించకూడదని నిర్ణయించాం. ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని బకాయి నిధులు విడుదలకు చర్యలు తీసుకోవాలి.
– పొన్నాన జయరాం, ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
జిల్లాలో అన్ని యాజమాన్యాల పరిధిలో 100 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో 16 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు మినహా మిగిలిన 84 ప్రైవేటు కాలేజీలే. వీటిల్లో ఫింక్షనింగ్ జరుగుతూ.. అడ్మిషన్లు జరుపుతున్న కాలేజీలు 76 వరకు ఉన్నాయి. వీటిలో 30 వేలు మంది వరకు చదువుతున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 2024–25 విద్యా సంవత్సరానికి గాను అకడమిక్ ఇయర్ బ్యాచ్కు రూ.45 కోట్లు, అంతకుముందు మూడు క్వార్టర్ల పెండింగ్ మరో రూ.35 కోట్లు కలిపి రూ.80 కోట్ల మేర ఒక్క డిగ్రీ విద్యకే పెండింగ్ ఉన్నట్టు ఏపీ ప్రైవేటు డిగ్రీ కాలేజీల మేనేజ్మెంట్స్ అసోసియేషన్ నాయకులు చెబుతున్నారు.

బకాయిల భారం భరించలేం!