
మండల స్థాయిలో సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహించాలి
శ్రీకాకుళం: జిల్లాలో సబ్జెక్టు కాంప్లెక్స్ను మండల స్థాయిలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా విద్యాశాఖాధికారి రవిబాబుకు వినతిపత్రం అందజేశారు. క్లస్టర్ స్థాయిలో సబ్జెక్టు కాంప్లెక్స్ నిర్వహించడం వల్ల ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యా విషయాలపై చర్చించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మండల స్థాయిలో నిర్వహిస్తే ఎక్కువ సంఖ్యలో చర్చించుకునేందుకు వీలు కలుగుతుందని తెలిపారు. 2025 పదో తరగతి మూల్యాంకనానికి సంబంధించిన రెమ్యూనరేషన్లను పూర్తిస్థాయిలో విడుదల చేయాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి తప్పించాలని కోరారు. డీఈవోను కలిసిన వారిలో సంఘం జిల్లా అధ్యక్షుడు దుప్పల శివరాం ప్రసాద్, జి.చిన్నికృష్ణ, ఎస్.రాజు, బి.జి.హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
ఆమె నేత్రాలు సజీవం
శ్రీకాకుళమ కల్చరల్ : ఇచ్ఛాపురం మెజిస్ట్రేట్ పెదసింగు పరేష్కుమార్ అమ్మమ్మ విజయలక్ష్మీ (100) అనారోగ్యం కారణంగా శుక్రవారం మృతి చెందారు. ఆమె నేత్రాలు ఇతరులకు ఉపయోగపడాలనే సదుద్దేశంతో నేత్రదానానికి మెజిస్ట్రేట్ పరేష్కుమార్, సీహెచ్.సురేష్, ఎం.ఢిల్లీరావులు ముందుకువచ్చారు. భౌతికకాయాన్ని స్వగ్రామం మచిలీపట్నానికి తరలించే ముందు విషయాన్ని ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ దేవేంద్రర్రెడ్డి రెడ్క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావుకు తెలియజేశారు. మగటపల్లి కల్యాణ్ నేత్రసేకరణ కేంద్రం టెక్నికల్ ఇన్చార్జి సుజాత, చిన్ని కృష్ణలు శ్రీకాకుళం వద్ద ఆమె కార్నియాలను సేకరించి విశాఖలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి అందజేశారు. దాత కుటుంబ సభ్యులకు రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు, సభ్యులు దుర్గాశ్రీనివాస్లు అభినందించారు. నేత్రదానం చేయాలనుకునేవారు 78426 99321 నంబరుకు తెలియజేయాలని కోరారు.
దివ్యాంగుల సమస్యలు పరిష్కరిస్తాం
శ్రీకాకుళం పాతబస్టాండ్: దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్సెల్ నిర్వహించి వినతులు స్వీకరించారు. 40 వినతులు రాగా.. వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు, హ్యాండ్ స్టిక్కులు, వినికిడి యంత్రాలను అందజేశారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జెడ్పీ సీఈఓ, దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఇన్చార్జి ఎ.డి. శ్రీధర్ రాజా, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.
స్కూల్గేమ్స్ అథ్లెటిక్స్ పోరుకు సిద్ధం
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలోని కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా శనివారం జిల్లాస్థాయి స్కూల్గేమ్స్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. డివిజన్ స్థాయిలో అండర్–14, 17, 19 విభాగాల్లో ఎంపికై న బాలబాలికలు ప్రాతినిధ్యం వహించనున్నారు. వీరికి వేర్వేరుగా రన్స్, త్రోస్, జంప్స్ ఈవెంట్స్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్జీఎఫ్ అధికారుల నేతృత్వంలో రన్నింగ్ ట్రాక్, ఇతర కోర్టులను సిద్ధం చేసి తుది మెరుగులు దిద్దారు. బేస్బాల్ ఎంపికలు శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి నిర్వహణ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాస్థాయి ఎంపిక పోటీల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం సాఫ్ట్బాల్ అండర్–14,17,19 వయో విభాగాల్లో ఎంపికలను పూర్తిచేశారు. మరోవైపు, పతకాలే లక్ష్యంగా క్రీడాకారులు ముమ్మరంగా సాధన చేస్తున్నారు.

మండల స్థాయిలో సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహించాలి

మండల స్థాయిలో సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహించాలి

మండల స్థాయిలో సబ్జెక్ట్ కాంప్లెక్స్ నిర్వహించాలి