
వేట మొదలు!
జిల్లాలో 11 మండలాల్లో మత్స్యకార కుటుంబాలు సముద్రపు వేటతో జీవనాధారంగా సాగిస్తున్నారు. ఇందులో ఈ ఏడాది వేట నిషేధ కాలంలో భృతిగా 15548 మందికి రూ.20 వేల చొప్పున మొత్తం రూ.31.09 కోట్ల భృతిని ఏప్రిల్ 26న జమ చేశారు. ఇందులో అర్హులైన చాలా మంది వేటదారులకు భృతి ఇవ్వకుండా ఆంక్షలు విధించారు. రాజకీయ కారణాలు ఒకవైపు కాగా.. విద్యుత్ వినియోగం తదితర నిబంధనలతో భృతి అందకుండా చేశారు. భృతి పొందిన వారికి ప్రభుత్వ ఇతర పథకాలు లబ్ధి ఉండదని కూడా స్పష్టం చేయడంతో మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఈ ఏడాది వేట నిషేధ భృతికి మొత్తం 511 మందిని అనర్హులుగా మత్స్యశాఖాధికారులు ప్రకటించారు. శ్రీకాకుళం రూరల్లో 31, గారలో 106, ఎచ్చెర్లలో 60, రణస్థలంలో 106, కవిటిలో 61, వజ్రపుకొత్తూరులో 35, పోలాకిలో 41, సోంపేటలో 32, సంతబొమ్మాళిలో 27, ఇచ్ఛాపురంలో 08, మందసలో 04 చొప్పున మత్స్యకారులు అనర్హులుగా గుర్తించారు. వాస్తవానికి ఈ లెక్క 1200 మంది వరకు ఉన్నట్లుగా మత్స్యకార సంక్షేమ సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు.
అరసవల్లి: గంగపుత్రులు సముద్రంలో వేటకు సిద్ధమయ్యారు.. రెండు నెలలుగా వేటకు దూరమై.. ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నిషేధ సమయం అర్థరాత్రితో ముగిసింది. దీంతో యధావిధిగా ఎలాంటి షరతులు, నిబంధనలు లేకుండా సముద్రంలోకి వేటకు మరబోట్లతో వెళ్లేందుకు అనుమతులు వచ్చేశాయి. ఏపీ మైరెన్ యాక్ట్ 1994 ప్రకారం ప్రతి ఏటా ఏప్రిల్ 14వ తేదీ అర్ధరాత్రి నుంచి జూన్ 14వ తేదీ అర్థరాత్రి వరకు వేట నిషేధ కాలంగా అమల్లో ఉండడంతో ఉపాధి కోల్పోయిన క్రమంలో వీరికి భృతిగా నగదు, డీజిల్ సబ్సిడీలను గత ప్రభుత్వం వరుసగా ఐదేళ్లుగా చెల్లించింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఒక ఏడాది భృతి ఎగ్గొట్టేసింది. ఈ ఏడాదికి మాత్రం భృతిని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతున్నట్లుగా ప్రకటించి...అర్హులకు కాకుండా కూటమి నేతల సిఫారసులున్నవారికి మాత్రమే భృతి జమ చేసింది. అయితే గతేడాది చెల్లించాల్సిన సుమారు రూ.31.72 కోట్ల మేరకు చెల్లించాల్సిన భృతిపై రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. పెండింగ్ భృతిని కూడా చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పినప్పటికీ ఎలాంటి చెల్లింపులు ఇంతవరకు జరగలేదు. దీంతో బాధిత మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు ప్రభుత్వం పాలన ఉంటుందని.. అలాంటిది వేటనిషేధ భృతిని అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే పెండింగ్లో పెట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
భృతి చెల్లించాల్సిందే...
జిల్లాలో గత ప్రభుత్వం వరుసగా ఐదేళ్ల పాటు వేట నిషేధ భృతి చెల్లించింది. అర్హులందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా చెల్లించింది. కూటమి ప్రభుత్వం మాత్రం అనవసర నిబంధనలు పెట్టి అర్హుల సంఖ్యను కుదించేసింది. దీంతో పాటు గతేడాది చెల్లించాల్సిన వేట నిషేధ భృతిని కూడా రూ.20 వేల చొప్పున అందించాలి.
– కోనాడ నర్సింగరావు,
మాజీ అధ్యక్షుడు, డీఎఫ్సీఎస్
ఆంక్షలతో అవస్థలు..
ముగిసిన వేట నిషేధ కాలం
సముద్ర తీరంలో వేటకు అనుమతులు
61 రోజులుగా ఉపాధి కోల్పోయిన వేటమత్స్యకారులు
గతేడాది నిషేధ భృతిపై ఇంకా నీలినీడలు
పెండింగ్లో 15860 మందికి భృతి చెల్లింపులు
గత ఏడాది భృతికి మంగళం!
గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014–19 మధ్యకాలంలో కూడా వేటనిషేధ సమయంలో కేవలం రూ.4 వేలు చొప్పున ఉపాధి భృతిగా ఇచ్చేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచుతూ, డీజిల్ సబ్సిడీని కూడా అందించింది. మొత్తం ఐదేళ్లలో 70,611 మందికి రూ.70.61 కోట్లను వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయించి మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెరిగేలా జగన్ సర్కార్ అడుగులు వేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024–25లో వేటనిషేధ కాలంలో ఉపాధి కోల్పోయిన మత్స్యకారులకు భృతిని గాలికొదిలేసింది. గతేడాది అర్హులుగా సర్వేలో గుర్తించిన 15,860 మందికి రూ.31.72 కోట్ల మేరకు వేట నిషేధ భృతి పెండింగ్లో పడినట్లయ్యింది. ఇంతవరకు ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయకుండా, కనీస స్పష్టత ఇవ్వకపోవడంతో మత్స్యకారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

వేట మొదలు!