కనగానపల్లి: రాయలసీమకు దక్కాల్సిన సాగు, తాగునీటి హక్కుల కోసం గురువారం చేపట్టనున్న పాదయాత్రకు రైతులు తరలిరావాలని వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తోపుదుర్తిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ నీటి హక్కుల సాధన కోసం చెన్నేకొత్తపల్లి మండలం న్యామద్దల సమీపంలోని హంద్రీ–నీవా కాలువపై 34వ కి.మీ రాయి వద్ద నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించనున్నట్లు చెప్పారు. జిల్లాలోని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నాయకులు హాజరవుతారన్నారు. రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.
చెరువు ఆక్రమణలు
తొలగించాలి
ప్రశాంతి నిలయం: జిల్లాలో ఆక్రమణలకు గురైన చెరువుల్లో సర్వే చేసి ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని జేసీ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వాచ్ డాగ్ కమిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ నీటి వనరుల హద్దులను సర్వే చేసి ఆక్రమణ దారులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. ధర్మవరం చెరువు, కొట్నూరు చెరువు, గోరంట్ల రావికుంట చెరువు తదితర ప్రధాన చెరువుల్లో జరిగిన ఆక్రమణలు, ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సమీక్షించారు. నిబంధనల మేరకే ఆక్రమణలు తొలగించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, తహసీల్దార్లు, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
అర్హత ఉన్నా తల్లికి వందనండబ్బులు పడలేదు
మడకశిర రూరల్: ‘మాకు సెంటు భూమి లేదు. కూలి పనులు చేస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తున్నాను. అయినా మాకు తల్లికి వందనం పడలేదు’ అని మారుతి, లక్ష్మీనరసప్ప తెలిపారు. తమ ఆధార్ కార్డుకు 10 ఎకరాల భూమి ఉందని చూపిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లెడుగుంటకు చెందిన లక్ష్మీనరసప్ప, రాధమ్మ దంపతులకు పవన్ 6వ తరగతి, రంజిత్ 1వ తరగతి పిల్లలు ఉన్నారు. అలాగే మారుతి, నాగమ్మ దంపతులకు నిహాల్ 6వ తరగతి, తేజ్ 1వ తరగతి చదువుతున్న పిల్లలు ఉన్నారు. అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వారు చదువుతున్నారు. అయితే తల్లికి వందనం డబ్బులు పడకపోవడంతో మారుతి కుమారుడితో కలిసి తహసీల్దార్ పూజారి ముకుందకు వినతిపత్రం అందజేశారు. న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
పారదర్శకంగా ‘సర్’
ప్రశాంతి నిలయం: ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ‘సర్’ కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ శ్యాంప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ‘సర్’ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం 1576 పోలింగ్ కేంద్రాలు ఉండగా కొత్తగా 210 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరణించిన ఓటర్ల సంఖ్య 55,068, శాశ్వతంగా వేరే ప్రాంతానికి మారిన వారు 49,466, ఇప్పటికే నమోదు అయినవారు 35,212, అందుబాటులో లేని ఓటర్లు సంఖ్య 30,686, ఇతరులు 152 ఉన్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 14,23,839 మంది ఓటర్లు ఉండగా ఈనెల 24 నాటికి 12,53,255 (88.02 శాతం) డిజిటలైజేషన్ పూర్తి చేశామన్నారు. 11,98,278 మ్యాపింగ్ అయ్యాయని, 5,48,650 సెల్ఫ్ మ్యాపింగ్ అయినట్లు పేర్కొన్నారు. 54,976 మంది మ్యాపింగ్ కాని వారు ఉన్నారు.


