గుడిబండ: నాయకులు, అధికారుల నిర్లక్ష్యంతో మడకశిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, పట్టించుకునేవారు లేకపోవడంతో ప్రతి మండలంలోనూ తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా దళిత కాలనీల్లోని ప్రజలకు గుక్కెడు నీటి కోసం నిత్యం ఎక్కడోచోట రోడ్డెక్కాల్సిన దుస్థితి నెలకొంది. గుడిబండ మండల పరిధిలోని ఫళారం గ్రామంలోని కొత్త దళిత కాలనీకి చెందిన మహిళలు తాగునీటి కోసం మంగళవారం రోడ్డెక్కారు. గుడిబండ – రొళ్ల మండలం వైపునకు వెళ్లే రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. మహిళలు మాట్లాడుతూ... కాలనీలో నీళ్లు రాక 15 రోజులవుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలనీలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజాప్రతినిధి దళితుడైనా తమకు తాగునీటి కష్టాలు తప్పడం లేదని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు


