గోరంట్ల: భార్యలతో గొడవ కారణంగా ఇద్దరు యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మండల పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు... మండల పరిధిలోని కళ్లగేరి తండాకు చెందిన రమేష్నాయక్ (33) శనివారం అర్ధరాత్రి గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలోకి వెళ్లి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ శేఖర్ పేర్కొన్నారు. ఆయన తెలిపిన వివరాలమేరకు... రమేష్నాయక్ తాగుడుకు బానిసై తరచు భార్యతో గొడవ పడేవాడన్నారు. శనివారం రాత్రి కూడా భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయి వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరివేసుకున్నాడని చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మసీదు సర్కిల్ ఏరియాలో మరొకరు..
మండల కేంద్రమైన గోరంట్లలోని మసీద్ సర్కిల్ ఏరియలో నివాసం ఉంటున్న ఉత్తరప్రదేశ్కు చెందిన పానీపూరి వ్యాపారి జోగేంద్ర సింగ్ (42) శనివారం అర్ధరాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సీఐ శేఖర్ తెలిపారు. జోగేంద్ర సింగ్, అతని భార్య రేఖారాణి ఇద్దరూ శనివారం రాత్రి గొడవ పడ్డారు. మనస్తాపం చెందిన జోగేంద్ర సింగ్ క్షిణికావేశంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేఖారాణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.


