అగళి: స్థానిక కేజీబీవీలో సమస్యలు తిష్టవేశాయి. మరుగుదొడ్లు అపరిశుభ్రంగా మారడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీనికి తోడు స్నానపు గదులకు కనీసం డోర్లు కూడా లేకపోవడంతో బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంఈఓ–1 నాగేంద్ర, ఎంఈఓ–2 చంద్రశేఖర్ బుధవారం కేజీబీవీని తనిఖీ చేయడంతో సమస్యలు బయటకు వచ్చాయి. ప్రధానంగా మరుగుదొడ్లు శుభ్రంగా లేవని, నీటి సమస్య ఉందని, స్నానపు గదులకు డోర్లు లేవని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపాల్ నాగరత్నమ్మను ఎంఈఓలు ఆదేశించారు. అనంతరం ఎంఈఓ నాగేంద్ర మాట్లాడుతూ కేజీబీవీపై ఇటీవల పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టామన్నారు. విద్యార్థినులకు సమస్యలు రాకుండా చూసుకోవాలని ప్రిన్సిపాల్ నాగరత్నమ్మ, ఉపాధ్యాయులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
అపరిశుభ్రంగా మరుగుదొడ్లు
డోర్లు లేని స్నానపు గదులు


