హిందూపురం: నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమం పురోగతిని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 157–హిందూపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎస్ఐఆర్ ఎలా చేస్తున్నారో సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలైజేషన్, మ్యాపింగ్, ఏఎస్డీ, డీఎస్ఈతో పాటు ఓటరు వివరాల నమోదు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. తర్వాత బీఎల్ఓలకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నాణ్యత, పారదర్శకతతో నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ప్రతి ఓటరును గుర్తించి జాబితాలో నమోదు చేయడంతో పాటు, అనర్హులైన నమోదులను నిబంధనల ప్రకారం పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన గడువులను తప్పనిసరిగా పాటిస్తూ ప్రతి బీఎల్ఓ తన పోలింగ్స్టేషన్ పరిధిలో పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
గంజాయి కేసులో
నిందితుడి అరెస్టు
రాప్తాడు రూరల్: గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడిని రాప్తాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. రాప్తాడు పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నం.62/2026 కేసులో పరారీలో ఉన్న అనంతపురం రూరల్ తపోవనంకు చెందిన అరుణ్ జాకబ్ అలియాస్ అరుణ్ రాస్తాను రాప్తాడు సమీపంలోని జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద అరెస్టు చేశారు. వివరాలను సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి డ్రగ్స్ వినియోగానికి ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. యువత గంజాయి, డ్రగ్స్తో పాటు ఇతర మత్తు పదార్థాలు, హానికరమైన వ్యసనాలకు దూరంగా ఉండాలని సీఐ సూచించారు.


