కనగానపల్లి: సకాలంలో వర్షాలు పడకపోవటంతో పంటలన్నీన్నీ ఎండిపోతున్నాయి. దీంతో వర్షం కోసం గ్రామాల్లో రైతులు దేవాలయాల్లో పూజలు, రామ భజనలు చేస్తున్నారు. మండలంలోని మద్దెలచెరువు గ్రామంలో సోమవారం రైతులు సంజీయరాయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రైతులంతా కలసి శ్రీరామ కీర్తనలతో భజనలు చేసుకుంటూ గ్రామాల వెంట రామదండుగా వెళ్లారు. ఈ విధంగా భక్తితో రామభజనలు చేసుకుంటూ రామదండు నిర్వహిస్తే వానలు పడతాయని ఒక నమ్మకంతో ఇలా చేస్తున్నామని గ్రామ పెద్దలు తెలిపారు. దీంతో పాటు వర్షంలో కోసం మంగళవారం గ్రామంలో పౌరాణిక నాటకాల ప్రదర్శనలు వేస్తున్నట్లు వారు తెలిపారు.
న్యామద్దలలో...
చెన్నేకొత్తపల్లి న్యామద్దల గ్రామంలోనూ సోమవారం రైతులు వర్షం కోసం రామదండు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులు స్థానిక దేవాలయాల్లో పూజలు నిర్వహించి తర్వాత రామభజనలు చేసుకుంటూ పురవీధులతో పాటు చుట్టు ప్రక్కల గ్రామాల్లో తిరిగారు. సకాలంలో వర్షాలు పాడి పంటలు బాగుండాలని ఈ విధంగా రామదండు చేస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.


