పుట్టపర్తి టౌన్: జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయం వీడియో కాన్సరెన్స్ హాలులో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా అర్జీల రూపంలో ఇచ్చుకోవచ్చని తెలియజేశారు. ఫిర్యాదుదారులు తమ ఆధార్కార్డు వెంట తీసుకురావాలని తెలిపారు.
వరుస చోరీలతో ప్రజల బెంబేలు
రామగిరి: మండలంలోని కలికివాండ్లపల్లి, పోలేపల్లి గ్రామాల్లో శనివారం రాత్రి వరుస చోరీలు జరిగాయి. కలికివాండ్లపల్లి గ్రామ నడిబొడ్డునగల సత్తెమ్మ ఆలయంలో 15 తులాలకుపైగా వెండి ఆభరణాలు, పోలేపల్లిలో రైతు రామకృష్ణారెడ్డి పొలంలో రెండు బోరు మోటార్లను గుర్తుతెలి యని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపా రు. ప్రస్తుత ప్రభుత్వంలో గ్రామాల్లో దౌర్జ న్యా లు, దోపిడీలు, జూదాలు, దొంగతనాలు అధికమయ్యాయని, అధికారులు చొరవచూపి ఇలాంటివి పూర్తి స్థాయిలో అరికట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.
దర్జాగా బైక్ అపహరణ
హిందూపురం: పట్టణంలోని బైపాస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్ వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని పట్టపగలే దర్జాగా అపహరించారు. ఆదివారం మధ్యాహ్నం ముదిరెడిపల్లికి చెందిన నగేష్ హనుమేపల్లికి చెందిన శ్రీనివాసరెడ్డి బైక్పై రెస్టారెంట్కు వచ్చాడు. ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసి లోపలికి వెళ్లడాన్ని ముగ్గురు దుండగులు గమనించారు. ఇదే అదునుగా భావించి ఒకరు ఫోన్లో మాట్లాడుతూ పరిసరాలు గమనిస్తుండగా.. మరో ఇద్దరు ద్విచక్ర వాహనంపై కొంతసేపు కూర్చొని నకిలీ తాళాలతో బైక్ను అపహరించారు. ఈదృశ్యాలన్నీ రెస్టారెంట్ సీసీ కెమెరా ల ఫుటేజీలో రికార్డయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కొడుకు హత్య కేసులో తల్లికి రిమాండ్
కదిరి టౌన్: కొడుకును హత్య చేసిన కేసులో తల్లి డక్కా నందినిని అరెస్టు చేసినట్లు పట్టణ సీఐ బి.వెంకటేశ్వర్లు తెలిపారు. వివరాలు.. కదిరి పట్టణంలోని మారుతీనగర్లో నివాసం ఉంటున్న తనకల్లు ప్రభుత్వాస్పత్రి వైద్యుడు విజయబాబు భార్య డక్కా నందిని తన ఐదేళ్ల కుమారుడు వర్షిత్ను చున్నీతో గొంతు బిగించి ఫిబ్రవరి 12న హత్య చేసినట్లు విషయం విదితమే. ఈ కేసులో డక్కా నందినిపై పట్టణ పోలీస్స్టేషన్లో బాధిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. భార్యాభర్తల మధ్య కలహాలతోనే తన కుమారుడిని డక్కా నందిని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆదివారం సాయంత్రం డక్కా నందినిని పోలీసులు అరెస్టు చేసి కదిరి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ఆమెకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించగా, అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.
భూమి కోసం ఇరువర్గాల ఘర్షణ
● ఆత్మహత్యాయత్నం చేసిన రైతు
లేపాక్షి: మండలంలోని నాగేపల్లికి చెందిన రైతు బెల్లం సురేష్ (40) ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్యాయత్నం చేశాడు. వివరాలు.. గ్రామానికి చెందిన బెల్లం సురేష్ తండ్రి శ్రీనివాసులు గతంలో తనకున్న 3 ఎకరాల పొలం హిందూపురానికి చెందిన శ్రీనివాసులు, భరత్కు విక్రయించాడు. కొనుగోలుదారులు భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అయితే బెల్లం సురేష్ భూమిలోకి ప్రవేశించి పంట సాగుకు యత్నించాడు. ఇంతలోనే భూమి కొనుగోలుదారులు అక్కడికి చేరుకొని అడ్డుకున్నారు. ఈభూమిలో తనకూ సగం వాటా ఉందని, ఇప్పటికీ సాగు చేస్తున్నామని శ్రీనివాసులు తెలియజేశాడు. అయితే ఇరువురి మధ్య వాగ్వాదం జరగడంతో రైతు సురేష్.. తన వెంట తెచ్చుకున్న క్రిమి సంహారక మందు తాగేందుకు యత్నించాడు. అంతేకాకుండా డయల్ 100కు కాల్ చేశాడు. పోలీసులు అక్కడికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వెంటనే 108 వాహనం ద్వారా రైతును హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే రైతుకు ఎలాంటి ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. ఎస్ఐ నరేంద్రను అడగ్గా, ఇంత వరకూ తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఇరువర్గాల వారు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి, విచారిస్తామన్నారు.
గంజాయి రవాణాదారుల అరెస్టు
ఎర్రగుంట్ల: గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అదివారం ఆయన విలేకరులకు వివరాలు తెలియజేశారు. ఎస్పీ నచికేత్ విశ్వనాఽథ్, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల వై జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా, అక్రమంగా గంజాయి రవా ణా చేస్తున్న ముగ్గురు పట్టుబడ్డారు. వారిలో పొద్దుటూరుకు చెందిన ఎస్.జహీర్, గుంతకల్లుకు చెందిన షేక్ మహ్మద్ తాహీర్, షేక్ ఆసిఫ్ ఉన్నారు. వీరు గుంతకల్లు షికారి కాలనీ చెందిన కమల, మఽధుమతి, జీవా నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. వీరి నుంచి 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1,900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.


