ప్రశాంతి నిలయం: యుగాలు మారినా... మానవుడు దైవాన్ని చేరే మార్గం ఒక్కటేనని, సన్మార్గంలో జీవితం గడపడం ద్వారా దైవాన్ని దర్శించవచ్చని సత్యసాయి సౌతాఫ్రికా భక్తులు నృత్యరూపంలో వివరించారు. పర్తి యాత్రలో భాగంగా ప్రశాంతి నిలయానికి విచ్చేసిన సౌతాఫ్రికా భక్తులు శుక్రవారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. దక్షిణాఫ్రికాలోని శ్రీ సత్యసాయి విద్యాసంస్థలకు చెందిన చిన్నారులు ‘అక్రాస్ ది ఏజెస్– టైం అండ్ ట్రూత్ ’ పేరుతో నిర్వహించిన నృత్య రూపకం భక్తులను మైమరపింపజేసింది. యుగయుగాలుగా మానవుడు వివిధ రూపాల్లో దేవుళ్లను పూజిస్తున్నారని, ఎన్ని యుగాలు మారినా దైవాన్ని చేరేందుకు అనుసరిస్తున్న మార్గం మాత్రం ఒక్కటేనన్న సత్యాన్ని వివరిస్తూ పలు ఘట్టాలను ప్రదర్శించారు. ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగంలో అవతరించిన అవతార పురుషులు శ్రీకృష్ణుడు, శ్రీరాముడు, సత్యసాయిల లీలలను చక్కగా వివరించారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.


