● నేడు అంత్యక్రియలు
మడకశిర రూరల్: ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, సీనియర్ న్యాయవాది మెళవాయి గోవిందరెడ్డి (99) కన్నుమూశారు. మడకశిర మండలంలోని తన స్వగ్రామం మెళవాయిలో బుధవారం ఉదయం 8.45 గంటలకు ఆయన కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. గురువారం ఉదయం మెళవాయి గ్రామ శివారున ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా, గోవిందరెడ్డి 1942లో విద్యార్థి దశలోనే శ్రీరామరెడ్డి, కల్లూరు సుబ్బారావు, నీలం సంజీవరెడ్డితో కలసి క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొనడంతో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అనంతరం పలు ఉద్యమాల్లో ఆయన పాలుపంచుకుంటూ వచ్చారు. ఆయన సేవలకు గుర్తుగా స్వాతంత్య్రనంతరం కర్ణాటక ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరగిన 75 ఏళ్ల స్వాతంత్య్రదినోత్సవంలో గోవిందరెడ్డిని అప్పటి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. కాగా, గోవిందరెడ్డి ఇక లేరన్న విషయం తెలియగానే మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రవిశేఖర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి జీబీ శివకుమార్, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్, ఈరన్న, సేవామందిర విద్యాసంస్థల అధినేత కేటీ శ్రీదర్, విశ్రాంత జడ్జి శివలింగేగౌడ్, మాజీ సర్పంచులు నారాయణరెడ్డి, కృష్ణమూర్తి, వక్కలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, వైఎస్సార్సీపీ నాయకులు జగన్నాథ్రెడ్డి, వేమారెడ్డి, రామచంద్ర,శివానంద్, వివిధ సంఘాల నాయకులు వేర్వేరుగా మెళవాయి గ్రామానికి చేరుకుని గోవిందరెడ్డి మృతదేహాంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు.


