ఆత్మకూరు/ కనగానపల్లి: చంద్రబాబు ప్రభుత్వం హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్ చేయించి సమీపంలో భూగర్భజలాలు అడుగంటేలా చేస్తూ రైతులకు కన్నీళ్లు మిగిలిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థం ఉమ్మడి జిల్లా ప్రజలకు శాపంగా మారింది. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి హంద్రీ–నీవా నీటిని సాఫీగా తీసుకెళ్లాలని కాలువ లైనింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. అయితే కాంక్రీట్తో లైనింగ్ చేస్తే నీరు ఆగకుండా ముందుకెళ్లిపోతాయి. సమీప ప్రాంతాల్లో నీరు ఇంకి భూగర్భజలాలు పెంపొందే అవకాశం లేకుండా పోతుంది. ఇలా చేయడం వల్ల తమకు నీటి ముప్పు తప్పదని రైతులు ఆందోళనలు చేసినా పెడ చెవిన పెట్టారు. రైతుల గోడు పట్టించుకోకుండా కాంక్రీట్ లైనింగ్ చకాచకా చేసేశారు. పనులు జరిగిన ఏడాదిలోపే రైతుల భయం నిజమైంది. భూగర్భజల మట్టం పడిపోయింది. క్రమేణా బోరుబావుల్లో నీరు తగ్గిపోయింది. కళ్లెదుటే కాలువలో నీళ్లు పోతున్నా ఉపయోగం లేకుండాపోయింది. రెండు ఇంచుల నీరు వచ్చే బోర్లు కూడా ఇప్పుడు రెండు ఎకరాలను తడపలేని పరిస్థితులు దాపురించాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కాలువ పక్కనే బోర్లు వేస్తున్నా చుక్క నీరు కూడా బయటకు రాలేదంటున్నారు. బోర్లలో నీరు సరిగా రాకపోవడంతో రైతులు పంటలు సాగు చేయలేకపోతున్నారు. దీంతో చాలా పొలాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి.
హంద్రీ–నీవా కాలువకు లైనింగ్ వేయడంతో వేగంగా ముందుకు వెళ్తున్న నీరు కాలువ పక్కనే బోరు వేసినా చుక్కనీరు పడని దృశ్యం
హంద్రీ–నీవా కాలువకు కాంక్రీట్ లైనింగ్
భూమిలో ఇంకని నీళ్లు.. అడుగంటిన బోర్లు
నీరందక పంటలు నిలువునా ఎండుతున్న వైనం
కాలువ సమీపంలో బోర్లు వేసినా చుక్కనీరు పడని వైనం
నీరందక బీళ్లుగా మారిన పొలాలు... లబోదిబోమంటున్న రైతులు


