ఓడీచెరువు(అమడగూరు): బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు బుధవారం అమడగూరులో వెలసిన చౌడేశ్వరీ దేవి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల చివరిరోజు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. అమ్మవారి రథం ఆలయం నుంచి బయలుదేరి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వరకూ మంగళవాయిద్యాల నడుమ సాగింది. భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి హంసవాహనంపై కొలువుదీర్చారు. కార్యక్రమానికి గాజులపల్లికి చెందిన జి.శాంతమ్మ, రాంమూర్తి, హర్షిత, నితిన్, లావణ్య, తేజస్, రామలక్ష్మమ్మ, బాలకృష్ణలు కార్యనిర్వహకులుగా వ్యవహరించారు.
విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు
చౌడేశ్వరీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఆలయ ధర్మకర్త పొట్ట పురుషోత్తం రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఉత్సవాలకు సహకరించిన ప్రతి ఒక్కరికీ అమ్మవారి కరుణాకటాక్షలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.
ఇంటర్ మూల్యాంకనం పూర్తి
పుట్టపర్తి: ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం జిల్లాలో బుధవారం పూర్తయ్యిందని డీఐఈఓ చెన్నకేశవప్రసాద్ తెలిపారు. జిల్లాలోని మూల్యాంకన క్యాంపునకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,09,708 జవాబు పత్రాలు వచ్చాయన్నారు. జవాబు పత్రాల మూల్యాంకనం తర్వాత బుధవారంతో మార్కుల నమోదు పూర్తయ్యిందని ఆయన వెల్లడించారు. రాష్ట్రమంతటా మూల్యాంకనం ఈనెల 8, 9 తేదీల్లో పూర్తవుతుందని, ఫలితాలు 12న వెలువడే అవకాశం ఉందన్నారు. అలాగే మూల్యాంకనంలో కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని చర్యలు పగడ్బందీగా చేపట్టారన్నారు. అందరి సహకారంతో గడువులోపు క్యాంపు పూర్తి చేశామన్నారు.


