● అధికారులకు కలెక్టర్ ఆదేశం
పుట్టపర్తి: వీబీజీ రామ్జీ పథకంలో పనులు చేసే కూలీలకు పని ప్రాంతంలో నీడ, తాగునీటి సౌకర్యం కల్పించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన బుక్కపట్నం సమీపంలోని కువ్వకొండ ప్రాంతంలో వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన ఖండిత కందకాల పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కూలీలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు. నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో చేరుకోవాలని అధికారులను ఆదేశించారు. పనిచేసే ప్రాంతంలో తప్పనిసరిగా మెడికల్ కిట్ అందుబాటులో ఉంచాలన్నారు. అడిగిన కూలీలందరికీ పనులు కల్పించాలన్నారు. జిల్లాలో 77 వేల మందికి పనులు కల్పించడమే లక్ష్యమన్నారు. జిల్లాలో ఈ ఏడాది 19 లక్షల పని దినాలను పూర్తి చేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్ శ్యాంప్రసాద్ గునపం పట్టి మట్టి తవ్వారు. కలెక్టర్ వెంట డ్వామా పీడీ విజయ్ప్రసాద్, క్లస్టర్ ఏపీడీ రమేష్బాబు, ఏపీఓ శ్రీనివాసరెడ్డి, ఈసీ మంజునాథ్, సిబ్బంది ఉన్నారు.
మాతాశిశు మరణాలను నివారించాలి : కలెక్టర్
ప్రశాంతి నిలయం: జిల్లాలో మాతాశిశు మరణాలను పూర్తిగా నివారించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం పీజీఆర్ఎస్ హాలులో వైద్య ఆరోగ్య శాఖపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఉద్యోగి బాధ్యతగా పని చేయాలన్నారు. బాల్య వివాహాలు, టీనేజీ ప్రెగ్నెన్సీతో కలిగే అనర్థాలపై గ్రామ స్థాయి నుంచే అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ నివారణకు బాలికలకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకూ ఓపీ నిర్వహించాలన్నారు. ఆస్పత్రి అభివృద్ధి నిధులను సక్రమంగా వినియోగించాలన్నారు. ఎన్సీడీ సర్వే వేగవంతం చేయాలన్నారు. అర్హత లేని చికిత్సలు చేస్తున్న ఆర్ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ఫైరోజాబేగం, డిప్యూటీ డీఎంహెచ్ఓలు పాల్గొన్నారు.
రీ సర్వే పక్కాగా నిర్వహించాలి : జేసీ
ఓడీచెరువు(అమడగూరు): ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా భూముల రీ సర్వే పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జాయింట్ కలెక్టర్ ఎం.మౌర్యభరద్వాజ్ ఆదేశించారు. అమడగూరు మండలం మహమ్మదాబాద్ గ్రామంలో కొనసాగుతున్న భూ రీసర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. రికార్డులు పరిశీలించి, సరిహద్దు రాళ్ల ఏర్పాటు ప్రక్రియ పారదరర్శకంగా చేపట్టాలన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా గడువు లోపు సర్వే పూర్తి చేసి పాసుబుక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. జేసీ వెంట తహసీల్దార్ మారుతీప్రకాష్, మండల సర్వేయర్, వీఆర్ఓలు, గ్రామ సచివాలయ సిబ్బంది ఉన్నారు.
సమస్యలు పరిష్కరించడంలో
నిర్లక్ష్యం వీడాలి
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను జేసీ మౌర్యభరద్వాజ్ హెచ్చరించారు. బుధవారం ఆయన అమడగూరు తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం రెవెన్యూ సిబ్బందితో సమావేశమై మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి అందే ప్రతి అర్జీకి గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. త్వరలో కంప్యూటర్ ఆపరేటర్తో పాటు అన్ని గ్రామాలకు వీఆర్ఓలను నియమిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో తహసీల్దార్ మారుతీప్రకాష్,ఆర్ఐ రామకృష్ణారెడ్డి, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు


