ప్రశాంతి నిలయం: వరికి ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, రాగి వంటి ఆరుతడి పంటలతో పాటు తక్కువ సమయంలోనే పంట చేతికొచ్చే కొర్ర, జొన్న, సజ్జ, అపరాల సాగును ప్రోత్సహించాలని కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఖరీఫ్ సాగు సన్నద్ధతపై కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కదిరి ప్రాంతంలో విజయవంతమైన ‘చియా’ సాగును జిల్లా వ్యాప్తంగా రైతులు సాగుచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ‘చియా’ సాగు పెరిగితే అందరికీ మంచి జరుగుతుందన్నారు. ఫారంపాండ్ల ప్రాముఖ్యతను వివరించి ప్రతి రైతూ తన పొలంలో నిర్మించుకునేలా వారిని చైతన్య వంతులను చేయాలన్నారు. వ్యవసాయాధికారులు వారంలో కనీసం నాలుగు రోజులు క్షేత్ర పర్యటనలు చేసి రైతులకు పంటల సాగులో సాంకేతిక తోడ్పాటును అందించాలన్నారు. ప్రస్తుతం ఉన్న సాగు విస్తీర్ణాన్ని మరో 10 శాతం అధికం చేయాలని, ప్రతి అధికారి తమ పరిధిలో 15 శాతం వృద్ధి రేటు సాధించేలా కృషి చేయాలన్నారు. జిల్లాలో మామిడి, దానిమ్మ, అరటి సాగు విస్తీర్ణం పెంచేందుకు కృషి చేయాలన్నారు. యాజమాన్య పద్ధతులు, వ్యవసాయ సమాచారం కోసం ప్రత్యేక యూట్యూబ్ ఛానల్ను ప్రారంభిస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కృష్ణయ్య, ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, కోఆపరేటివ్ అధికారి కృష్ణానాయక్, పట్టు పరిశ్రమ శాఖ అధికారి శోభారాణి, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, సిబ్బంది పాల్గొన్నారు.
‘చియా’ సాగు విస్తీర్ణం పెంచాలి
ఖరీఫ్ సన్నద్ధతపై సమీక్షలో
కలెక్టర్ శ్యాంప్రసాద్ ఆదేశం


