పుట్టపర్తి టౌన్: జల సంరక్షణపైనే మన భవిత ఆధారపడి ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ జల సంరక్షణకు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్, ఎమ్మెల్యే సింధూరారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పుట్టపర్తి మండలంలోని బీడుపల్లి క్రాస్ వద్ద ‘నీటి భద్రత,–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా జలవనరుల శాఖ అధ్వర్యంలో చేపడుతున్న వంక పనులకు కలెక్టర్, ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులను జల సంరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేశామన్నారు. వేసవిలో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేసి వర్షాకాలం నాటికి ప్రతి నీటి చుక్కను భూమిలోకి పంపడమే లక్ష్యమన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ సువర్ణ, ఇరిగేషన్ ఈఈ గురుమూర్తి, డీఈలు గంగాధర్, గంగాద్రి, ఏఈలు సుధాకర్ రాజు, జమునా భాయి తదితరులు పాల్గొన్నారు.


