పుట్టపర్తి: చందబ్రాబు ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ గజ్జల హరి ప్రసాద్రెడ్డి, జనరల్ సెక్రెటరీ గౌస్ లాజం డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఫ్యాప్టో మలి దశ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సోమవారం పదో తరగతి జవాబు పత్యాల మూల్యాంకనానికి ఉపాధ్యాయులంతా నల్లబ్యాడ్జీలు ధరించి హాజరయ్యారు. ఈ సందర్భంగా గజ్జల హరి ప్రసాద్రెడ్డి, గౌస్ లాజం మాట్లాడుతూ..ఉపాధ్యాయుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలపై ప్రభుత్వం మౌనం వీడి వెంటనే పరిష్కారం చూపాలన్నారు. 11వ పీఆర్సీ ముగిసి 3 ఏళ్లు పూర్తయినా 12వ పీఆర్సీ కమిషన్ నియమించక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమన్నారు. పీఆర్సీ ఆలస్యమవుతున్న నేపథ్యంలో మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు రూ.30 వేల కోట్ల బకాయిలను విడతల వారీగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దీర్ఘకాల బకాయిల చెల్లింపునకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న 4 డీఏలు చెల్లించాలని, సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి మెరుగైన పెన్షన్ విధానం తీసుకురావాలన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టాలని, బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు గోపాల్ నాయక్, జాఫర్ హుస్సేన్, ఏపీటీఎఫ్ నేతలు చంద్ర, అశోక్కుమార్, త్రిమూర్తి, యూటీఎఫ్ నేత లక్ష్మీనారాయణ, హెచ్ఎం అసోసియేషన్ ప్రతినిధులు గోపాల్, మనోజ్, డీపీఎఫ్ షర్ఫుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్యాప్టో ఆధ్వర్యంలో టీచర్ల నిరసన
నల్లబ్యాడ్జీలతో పదో తరగతి మూల్యాంకనానికి హాజరు


