హిందూపురం టౌన్: ఇంటికి వేసిన తాళం, తలుపులు బద్ధలుగొట్టి యజమానురాలు భారతిపై దాడి చేసిన ఘటన లేపాక్షి మండలం కల్లూరులో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన మేరకు... కల్లూరు గ్రామంలో భారతికి సొంతిల్లు ఉంది. కుమారుడు, కుమార్తె బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. ఈ క్రమంలో భారతి ఒక్కరే కల్లూరులోని ఇంట్లో ఉండలేక హిందూపురానికి మకాం మార్చింది. బుధవారం తన కుటుంబానికి సంబంధించిన వెంకటనారాయణమ్మ, ఆమె కుమారుడు నవీన్ కుమార్ కల్లూరులోని భారతి ఇంటికి వేసిన తాళం బద్ధలుగొట్టి లోపలికి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న భారతి అక్కడు వెళ్లి వారిని ప్రశ్నించడంతో దుర్భాషలాడుతూ దాడి చేసి హతమార్చేందుకు ప్రయత్నించారు. స్థానికులు అడ్డుపడడంతో ప్రాణాలు దక్కించుకుని అక్కడి నుంచి బయటపడిన ఆమె ఆటోలో హిందూపురం చేరుకుని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పతిలో చేరింది. తనను హతమార్చి ఇల్లు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ ఆమె వాపోయింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది.


